ప్రమాణస్వీకార ఏర్పాట్లు చకచకా
ABN , Publish Date - Jun 09 , 2024 | 01:27 AM
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 12న గన్నవరం మండలంలోని కేసరపల్లి మేధా టవర్స్ పక్కన జరిగే సభాస్థలిని సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న, అడిషనల్ డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) బాగ్చి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, దిల్లీరావు, ఐజీలు అశోక్ కుమార్, రాజశేఖర్బాబు, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, సీపీ రామకృష్ణ ఏర్పాట్లను పరిశీలించారు.
![ప్రమాణస్వీకార ఏర్పాట్లు చకచకా](https://media.andhrajyothy.com/media/2024/20240604/OVERALL_3_df10ab63bf.jpg)
కేసరపల్లిలోని మేధా టవర్స్ పక్కన సభాస్థలి
చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించిన అధికారులు
గన్నవరం, జూన్ 8 : చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 12న గన్నవరం మండలంలోని కేసరపల్లి మేధా టవర్స్ పక్కన జరిగే సభాస్థలిని సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న, అడిషనల్ డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) బాగ్చి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, దిల్లీరావు, ఐజీలు అశోక్ కుమార్, రాజశేఖర్బాబు, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, సీపీ రామకృష్ణ ఏర్పాట్లను పరిశీలించారు. సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రదేశాలు, ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల, జాతీయ రహదారి పక్కనే ఉన్న మేధా టవర్స్ వెళ్లే రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వెళ్లేందుకు నిర్మిస్తున్న కొత్త రోడ్డును పరిశీలించారు. ఎక్స్కవేటర్లతో ముళ్ల పొదలు తొలగించడంతో పాటు చదును చేయించారు. మేధా టవర్స్ పైకి వెళ్లి అక్కడి నుంచి బహిరంగ సభా ప్రదేశాన్ని పరిశీలించారు. రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. గన్నవరం విమానాశ్రయం సందర్శించి అక్కడ పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. కేసరపల్లిలోని పెట్రోల్ బంకు వద్ద పార్కింగ్ ప్రదేశాన్ని కూడా చూశారు. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్లు గీతాంజలి శర్మ, సంపత్కుమార్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఐజీ గోపీనాథ్శెట్టి, విజయవాడ డీసీపీ ఆదిరాజు ఎస్.రానా, విమానాశ్రయం డైరెక్టర్ ఎంఎల్కే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీలు సత్యనారాయణరాజు, పరుచూరి అశోక్బాబు, బూరగడ్డ వేదవ్యాస్, కిలారు రాజేశ్, ఏఎంసీ మాజీ చైర్మన్ పొట్లూరి బసవరావు, టీడీపీ నేతలు చిరుమామిళ్ల సూర్యం, దొంతు చిన్న తదితరులు శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు.