Share News

బియ్యం మాయం, పేర్ని నానీకి అధికారుల సహకారంపై విచారణ జరపాలి

ABN , Publish Date - Dec 29 , 2024 | 01:45 AM

పేర్ని నాని బఫర్‌ గిడ్డంగిలో మాయమైన రేషన్‌ బియ్యం కేసులో అధికారులు జాప్యం చేస్తున్నారని, పూర్తి విచారణ జరపాలని శనివారం టీడీపీ నాయకులు డీఆర్వో కె.చంద్రశేఖర్‌, ఏఎస్పీ సత్యనారాయణ, రూరల్‌ ఎస్‌ఐ సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు.

బియ్యం మాయం, పేర్ని నానీకి అధికారుల సహకారంపై విచారణ జరపాలి
ఏఎస్పీ సత్యనారాయణకు వినతిపత్రం అందిస్తున్న టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్‌, ఐ.దిలీ్‌పకుమార్‌

టీడీపీ సీనియర్‌ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్‌ డిమాండ్‌

పార్టీ నేతలతో కలిసి డీఆర్వో, పోలీసులకు ఫిర్యాదు

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘దొంగతనం చేసి మాజీ మంత్రి పేర్ని నాని అండ్‌ కో అడ్డంగా దొరికిపోయారు. పైగా బుకాయిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపించాలి. గోదాములో బియ్యం మాయం ఘటనలో అధికారుల ప్రమేయంపైనా విచారణ జరపాలి. అప్పుడే అసలు వాస్తవాలు బయటపడతాయి.’ అని టీడీపీ సీనియర్‌ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్‌ డిమాండ్‌ చేశారు. పేర్ని నాని బఫర్‌ గిడ్డంగిలో మాయమైన రేషన్‌ బియ్యం కేసులో అధికారులు జాప్యం చేస్తున్నారని, పూర్తి విచారణ జరపాలని టీడీపీ నాయకులతో కలిసి శనివారం ఆయన డీఆర్వో కె.చంద్రశేఖర్‌, ఏఎస్పీ సత్యనారాయణ, రూరల్‌ ఎస్‌ఐ సత్యనారాయణకు ఆయన వినతిపత్రం సమర్పించారు. గత నెల 26న అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే ఈనెల 10న ఎస్పీకి ఫిర్యాదు చేశారని అన్నారు. తొలుత 3,708 బస్తాలు మాయమయ్యాయని, తర్వాత 7,577 బస్తాలు మాయమయ్యాయని చెప్పడం వెనుక ఉద్దేశపూర్వక కుట్ర కనిపిస్తోందని గోపీచంద్‌ అన్నారు. నివేదికల్లో ఇన్నిసార్లు లెక్కలు ఎందుకు మారుతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. అధికారులు పేర్ని నానీకి ఎం తగా సహకరిస్తున్నారో ఈ ఘటనలే నిదర్శనమన్నారు. జనవరిలో అగ్రిమెంట్‌ చేసుకునే ముందు స్టాక్‌ ఎందుకు పరిశీలించలేదో అధికారులను విచారించాల న్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇలియాస్‌ పాషా, రూరల్‌ పార్టీ అధ్యక్షుడు కుంచే నాని, జడ్పీటీసీ మాజీ సభ్యుడు లంకే నారాయణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 01:45 AM