రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని దుర్మరణం
ABN , Publish Date - Jan 14 , 2024 | 01:02 AM
చెన్నై-కోల్కతా 16వనెంబర్ జాతీయరహదారిపై పొట్టిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతిచెందగా మరొకరికి స్వల్పగాయాలయ్యాయి.
![రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని దుర్మరణం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఉంగుటూరు, జనవరి 13: చెన్నై-కోల్కతా 16వనెంబర్ జాతీయరహదారిపై పొట్టిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతిచెందగా మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ఆత్కూరు ఎస్సై టి.సూర్యశ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం పసర్లపూడికి చెందిన శ్రీరామరెడ్డి సత్యనాగసాయి(26), అదే జిల్లా రామచంద్రపురానికి చెందిన బొబ్బా చాందిని(25) హైదరాబాద్లో వేర్వేరు కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ఇద్దరు బుల్లెట్పై శుక్రవారం రాత్రి 11గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. తలకు హెల్మెట్లు ధరించారు. శనివారం ఉదయం విజయవాడ దాటాక చాందినికి చెవి నొప్పిగా వుండటంతో హెల్మెట్ తీసి బండికి తగిలించింది. పొట్టిపాడు ఫ్లైౖఓవర్ బ్రిడ్జి దిగిన తర్వాత మంచు కారణంగా దారి సరిగా కనబడకపోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న భారీ కంటైనర్ను బుల్లెట్ వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్ వెనుక కూర్చున్న చాందిని ఎగిరి రోడ్డుపై పడి, తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందింది. సత్యనాగసాయికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు చాం దిని మృతదేహాన్ని పోస్ట్మార్టానికి గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.