ఘనంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలు
ABN , Publish Date - Feb 11 , 2024 | 10:34 PM
లంబాడీల ఆరాధ్య దేవుడు సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాలను ఆదివారం రాయచోటి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
రాయచోటి టౌన్, ఫిబ్రవరి11: లంబాడీల ఆరాధ్య దేవుడు సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాలను ఆదివారం రాయచోటి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పగిడీ పట్టు వస్త్రాల పూజ నిర్వహించారు. అనంతరం గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కే విశ్వనాఽథ నాయక్, గణపతి మహరాజ్, లంబాడా హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు శంకర్నాయక్, కృష్ణానాయక్లు మాట్లాడుతూ ఈకార్యక్రమానికి హథీరాంజీ మఠం తిరుమల తిరుపతి వారు పట్టు వస్త్రాలు పంపించడం ఆనందదాయకమన్నారు. అనంతరం లంబాడీల సాంస్కృతిక నృత్యాలు, వేషధారణ, సంస్కృతి సంప్రదాయాలు, కట్టుబాట్లపె ప్రసంగించారు. తిరుమలలోని హథీరాంజీ మఠంలో లంబాడాలకు ఒక ప్రత్యేక విభాగం ఉండేదని, ప్రభుత్వం ఈ మఠాన్ని నిర్వీర్యం చేయడం లంబాడీల సంస్కృతిని దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లంబాడాల సంస్కృతి, సంప్రదాయదాయాలు, కట్టుబాట్లను ప్రభుత్వాలు గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ లత, విశ్రాంత తహసీల్దార్ గోవిందనాయక్, శంకర్నాయక్, వినోద్నాయక్, శంకర్నాయక్, సావిత్రి బాయి, విద్యార్థులు పాల్గొన్నారు.