Share News

ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య

ABN , Publish Date - May 19 , 2024 | 09:35 PM

పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తామని సీపీఎం అన్నమయ్య జిల్లా కమిటీ సభ్యుడు అబ్బవరం రామాంజులు అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఆదివారం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య
రాయచోటి: పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న సీపీఎం నేతలు

రాయచోటిటౌన, మే 19: పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తామని సీపీఎం అన్నమయ్య జిల్లా కమిటీ సభ్యుడు అబ్బవరం రామాంజులు అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఆదివారం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఏవీ రమణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, సీపీయం నాయకులు మాధవయ్య మాట్లాడుతూ ఎగువ గొట్టివీడుకు చెందిన నాగరాజు ఆర్థిక సహకారంతో 100 మంది రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశామని తెలిపారు. నిజాయితీకి మారుపేరుగా ఉదహరించే మహానాయకుల్లో సుందరయ్య ఒకరన్నారు. ఈ కార్యక్రమంలో సీఐఈయూ నాయకులు ఆదిలక్ష్మి, సులోచన, అంజి, హర్ష, చెన్నయ్య, అంజి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

గాలివీడు: పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శ నేతగా పేరు గాంచారని సీఐటీయూ వీఆర్‌ఏల సంఘం జిల్లా కార్యదర్శి భోగేశ్వరయ్య కొనియాడారు. ఆదివారం పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు నాయకుడైన పుచ్చలపల్లి సుందరయ్య స్వాతంత్ర ్య సమరయోధుడని, దక్షిణ భారతదేశంలోని కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత అని వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సారథి అని కొనియాడారు. ప్రజల కోసం తన ఆస్తినంతటిని పార్టీకి, ప్రజలకు పంపిణీ చేసిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు. నిజాయితీకి మారుపేరు పుచ్చలపల్లి సుందరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రాజంపేట టౌన: రాజంపేట పట్టణంలోని ఐసీడీఎస్‌ కార్యాలయ ఆవరణంలో ఆదివారం సీఐటీయూ జిల్లా కార్యదర్శి సి.రవికుమార్‌ ఆధ్వర్యంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్ట్‌ ఉధ్యమ నిర్మాణంలో ఎంతో కీలక పాత్ర పోషించి కుల వ్యవస్థ నిర్మూలనకు ఎంతో కృషి చేసి పేదవర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శజీవితాన్ని గడిపిన మహానాయకుడు సుందరయ్య అన్నారు. ఆయన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి అయినా తన పేరులోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్న గొప్ప నాయకుడన్నారు. స్వాతంత్య్ర సమరం లోనూ, అనేక ఉద్యమాల్లోనూ ప్రజారాజ్యం వంటి పుస్తకాల రచనల్లోనూ ఆయన చేసిన సేవ ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంగనవాడీ అధ్యక్షురాలు లక్ష్మీ, ఈశ్వరమ్మ, నరసింహ, లక్ష్మీదేవి, ప్రసాద్‌, సురేష్‌, సాయి, రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2024 | 09:35 PM