ఎన్నికల్లో అల్లర్లు సృష్టిస్తే కేసులు నమోదు
ABN , Publish Date - Apr 19 , 2024 | 11:21 PM
పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు సృష్టించేవారిపై రౌడీషీట్ తెరుస్తామని రాయచోటి డీఎస్పీ మహబూబ్బాషా హెచ్చరించారు.
డీఎస్పీ మహబూబ్ బాషా
లక్కిరెడ్డిపల్లె, ఏప్రిల్ 19: పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు సృష్టించేవారిపై రౌడీషీట్ తెరుస్తామని రాయచోటి డీఎస్పీ మహబూబ్బాషా హెచ్చరించారు. శుక్రవారం రాత్రి లక్కిరెడ్డిపల్లె, పాళెంగొల్లపల్లె, కస్తూరిరాజుగారిపల్లెల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. బైకులు, ఇతర వాహనాలుపై అనుమతులు లేకుండా పార్టీ జెండాలు పెడితే వెంటనే అరెస్టు చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించించేది లేదన్నారు. మే 11 వరకు ప్రచారం నిర్వహించుకోవచ్చని, ప్రచారంలో మద్యం సేవించినా, ఇతర పార్టీలను దూషించినా, అల్లర్లు జరిగినా వెంటనే అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేస్తామన్న్నారు. పోలింగ్ రోజు డిన్నర్లు, మద్యం క్రయాలు, డబ్బు పంపిణీతోపాటు, గుంపులుగా కనిస్తే చర్యలు తప్పవన్నారు. ఎన్నికల్లో నమోదు అయిన కేసులు జీవితాంతం ఉంటాయని, ఎన్నికలు జరిగే ప్రతిసారీ కేసు ఉన్న వ్యక్తిని అరెస్టు చేస్తారన్నారు. గ్రామాల్లో మద్యం సేవించి అల్లర్లు సృష్టిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా 100 ఫోన్ చేసి సమాచారాన్ని అందించాలన్నారు. ప్రచారంలో మద్యం కనిపిస్తే చర్యలు తప్పవన్నారు.ఈ కార్యక్రమంలోసీఐ జీవన్ గంగనాథబాబు, ఎస్ఐ విష్ణువర్ధన్ హెడ్కానిస్టేబుల్స్ రామ్ప్రసాదు, గోపినాయక్, పోలీసు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.