Share News

ఏడేళ్లుగా సాగుతున్న మురుగునీటి శుద్ధి ప్లాంటు నిర్మాణం

ABN , Publish Date - May 19 , 2024 | 01:07 AM

పట్టణంలోని పూలే కాలనీ వద్ద నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి ప్లాంటు ఏడేళ్లు అయినా పూర్తికాలేదు. 2017లో టీడీపీ ప్రభుత్వం పట్టణానికి ఈ ప్లాంటును మంజూరు చేసింది.

ఏడేళ్లుగా సాగుతున్న మురుగునీటి శుద్ధి ప్లాంటు నిర్మాణం
పూలే కాలనీ వద్ద నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్‌

తెనాలి అర్బన్‌, మే 18: పట్టణంలోని పూలే కాలనీ వద్ద నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి ప్లాంటు ఏడేళ్లు అయినా పూర్తికాలేదు. 2017లో టీడీపీ ప్రభుత్వం పట్టణానికి ఈ ప్లాంటును మంజూరు చేసింది. ఆ ప్రభుత్వ హయాంలో ప్లాంట్ల నిర్మాణం కొంతవరకు పూర్తయింది. ఆ తరువాత ప్రభుత్వం మారిన వెంటనే ప్లాంటును పట్టించుకునే వారే లేకుండాపోయారు. పట్టణంలోని మురుగు నీటిని మంచినీటిగా మార్చి పొలాలకు అందించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. రోజుకు 10 మిలియన్‌ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే సామర్ధ్యంతో దీనిని రూపుదిద్దారు. పట్టణంలో వర్షా కాలంలో రోడ్లన్నీ నీటితో నిండిపోతున్నాయి. వర్షపు నీటిని బయటకు పంపే ప్రధాన డ్రెయిన్లన్నీ ఆక్రమణలతో కుంచించుకుపోవడం, తరచూ పూడిపోవడం వలన చిన్న చినుకు పడినా పట్టణ వీధులన్నీ జలమయం అవుతున్నాయి. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యను గట్టెక్కించేందుకు నాటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులు 50శాతం, రాష్ట్ర ప్రభుత్వ నిధులు 25 శాతం, మున్సిపల్‌ నిధులు 25శాతం కేటాయించి ప్రాజెక్టు మంజూరుచేసింది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో పట్టించుకోకుండా చివరి ఏడాది నిర్మాణాన్ని చేపట్టారు. గత ఐదేళ్లుగా పట్టణ రహదారుల ముంపు సమస్యతో ప్రజలు సతమతమయ్యారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దోమల బెడద కూడా చాలా వరకు తీరుతుంది. మురుగు కాల్వలో ఎక్కడా నీరు నిల్వ లేకుండా 30 హార్స్‌ పవర్‌, 15 హార్స్‌ పవర్‌ ఉన్న మోటార్ల ద్వారా నీటిని మళ్లించి శుద్ధి చేస్తారు. ఈ ప్లాంటు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి వచ్చే వర్షాకాలం నాటికి రహదారుల ముంపు సమస్య తీర్చాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 19 , 2024 | 01:07 AM