Share News

నల్లమడ కట్టను తవ్వేస్తున్నారు

ABN , Publish Date - May 21 , 2024 | 12:33 AM

ఇసుక దందాకు పాల్పడే అక్రమార్కుల కళ్ళు తరుచూ నల్లమడ కట్టలపై పడుతున్నాయి.

నల్లమడ కట్టను తవ్వేస్తున్నారు
బాపట్ల మండలం తూర్పు పిన్నిబోయనవారిపాలెం సమీపంలో వెంకటరంగాపురం దగ్గర నల్లమడ కట్టను తవ్వి ఇసుకను తరలించిన ప్రాంతం

బాపట్ల, మే 20: ఇసుక దందాకు పాల్పడే అక్రమార్కుల కళ్ళు తరుచూ నల్లమడ కట్టలపై పడుతున్నాయి. గతంలో అప్పికట్ల సమీపంలోని నల్లమడ కట్టను పెద్దఎత్తున తవ్వి తరలించారు. అక్కడ రైతులు ఆందోళన చేయటంతో ఉపసంహరించారు. ఆ తర్వాత కొండుభొట్లపాలెం హైస్కూల్‌ ప్రహరీగోడ పడగొట్టి మరీ దారి ఏర్పాటుచేసుకొని నల్లమడ కట్ట ఇసుకను తవ్వి తరలించారు. తాజాగా అధికారులంతా ఎన్నికల విధులలో బీజీగా ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని తూర్పు పిన్నిబోయనవారిపాలెం గ్రామసమీపంలో అడవిగ్రామపంచాయతీ వెంకటరంగాపురం దగ్గర నల్లమడ కట్టను పెద్దఎత్తున తవ్వి ఇసుకను తరిలించారు. పరిసర గ్రామాలలో ప్లాట్‌ల మెరకకు, రియల్‌ఎస్టేట్‌ వెంచర్లకు తరలించటానికి ఇసుకను ఈవిధంగా పెద్దఎత్తున తరలించినట్లు తెలుస్తున్నది. ఇసుక అక్రమ వ్యాపారంతో కోట్లరూపాయలు సంపాదిస్తున్న వ్యాపారులు బాపట్లలో ఉన్నారు. బడా వ్యాపారులకు తీసిపోమన్నట్లు కొంతమంది చోటా వ్యాపారులు కూడా ఇసుకను అక్రమంగా తరలించి లక్షలు ఆర్జిస్తున్నారు. ఈవిధంగా నల్లమడకట్టను అనేకచోట్ల తవ్వి తరలిస్తున్నారు. విపత్తుల సమయంలో ఎగువప్రాంతాల నుంచి భారీ ఎత్తున వచ్చే వరదనీటి వల్ల కట్టలు బలహీనంగా ఉన్నచోట్ల గండ్లు పడి పొలాలు ముంపునకు గురికావటంతోపాటు గ్రామాలలోకి కూడా వరదనీరు వచ్చే ప్రమాదం ఉంది. అయినప్పటికీ డ్రైనేజీ అధికారులు అక్రమవ్యాపారులపై సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో తరుచూ అనేక ప్రాంతాలలో నల్లమడ డ్రెయిన్‌ కట్టలను తవ్వి తరలిస్తున్నారు.

చర్యలు తీసుకోవాలి : బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కాగిత కోటేశ్వరరావు, ఎమ్మెల్యే అభ్యర్థి గుదే రాజారావు

నల్లమడ కట్టను తవ్వి తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో డ్రైనేజీ అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపించాలి. 200 ట్రక్కులకు పైగా ఇసుకను తవ్వి తరలించారు. దీనిపై అధికారులు ఏమాత్రం పట్టించుకోవటంలేదు. కట్ట తవ్విన ప్రాంతాన్ని పరిశీలించాం. దీనిపై కలెక్టర్‌తోపాటు మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తాం. డ్రైనేజి అధికారుల దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్ళాం.

పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాం : డ్రైనేజి జేఈ భరద్వాజ

వెంకటరంగాపురం దగ్గర నల్లమడ కట్టను తవ్వి తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. 54 మీటర్ల పొడువు, 2 మీటర్ల వెడల్పు, ఒకటిన్నర మీటరు ఎత్తులో ఇసుకను తవ్వి తరలించినట్లు గుర్తించాం. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకునేలా చూస్తాం. మరొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం.

Updated Date - May 21 , 2024 | 12:33 AM