Share News

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , Publish Date - May 27 , 2024 | 12:06 AM

ఘర్షణలు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు.

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

బాపట్ల, మే 26 : ఘర్షణలు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం ఆయా పోలీసుస్టేషన్‌ల పరిధిలో పాతనేరస్తులకు, ఇటీవల జరిగిన ఘర్షణలలో పాల్గొన్న వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా, ఆ తర్వాత జిల్లాలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలలో భాగంగా కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. పోలీసు అధికారుల సూచనలు పెడచెవిన పెట్టి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొన్న, ఎన్నికల నియమావళిని అతిక్రమించి ఘర్షణలు, ర్యాలీలలో పాల్గొన్నవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పోలీసు అధికారులు పోలీసుస్టేషన్‌ పరిధిలో నివాసం ఉండే పాతనేరస్తులు, ఘర్షణలకు పాల్పడటానికి అవకాశం ఉన్నవారిపై, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రజలను రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేసినా, ర్యాలీలు, ఊరేగింపులలో పాల్గొన్నా, బాణాసంచా కాల్చినా చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎటువంటి వివాదాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళ్ళకుండా సత్‌ప్రవర్తనతో మెలగాలని సూచించారు. పట్టణ పోలీసుస్టేషన్‌లో సీఐ యు.శ్రీనివాసులు పాతనేరస్తులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Updated Date - May 27 , 2024 | 12:06 AM