పల్నాట.. పోలీసుల పహారా
ABN , Publish Date - May 17 , 2024 | 12:32 AM
పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చిన్న అలికిడి అయినా భీతిల్లిపోతున్నారు.
నిర్మానుష్యంగా వీధులు.. దుకాణాల మూత
ఎక్కడికక్కడ పోలీసు పికెట్లు.. ఇళ్లల్లో తనిఖీలు
వైసీపీ నేతల ఇళ్లల్లో పెట్రో బాంబులు స్వాధీనం
నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు
మాచర్లటౌన, కారంపూడి, ముప్పాళ్ల, మాచవరం, పిడుగురాళ్ల, మే 16: పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చిన్న అలికిడి అయినా భీతిల్లిపోతున్నారు. పట్టణాలు, పల్లెలు పోలీసు పహారా మధ్య ఉన్నాయి. జిల్లా అంతటా 144 సెక్షన గురువారం కూడా కొనసాగింది. దుకాణాలను పోలీసులు తెరవనీయలేదు. దీంతో జిల్లా అంతటా అప్రకటిత కర్ఫ్యూ అమలవుతుంది. పట్టణాలతో పాటు పల్లెల్లోనూ వీధులు జనసంచారం లేకపోవడంతో నిర్మానుష్యంగా మారాయి. రెండు రోజులుగా ఎటువంటి అల్లర్లు జరగలేదు. అయినా ఇరువర్గాల వారు ఏ సమయంలోనైనా దాడులకు పాల్పడే అవకాశం ఉందని భావించిన పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. అనుమానితుల గృహాల్లో సోదాలతో పాటు ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. అదనపు బలగాలతో పికెట్లు కొనసాగుతున్నాయి. మాచర్లలో బందోబస్తు నిమిత్తం తమిళనాడు నుంచి 110 మందితో కూడిన పోలీసు బలగాలను గురువారం మాచర్లకి రప్పించారు. పట్టణంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీలు ఐదుగురు, సీఐలు ఏడుగురు, ఎస్ఐలు 22 మంది, ఏఎస్ఐలు నలుగురు, హెడ్ కానిస్టేబుళ్లు 11, పోలీసు కానిస్టేబుళ్లు 40, హోంగార్డులు 101, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు 77 మంది, సీఐఎస్ఎఫ్ 90 మంది, ఏపీఎస్పీ 21 మంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని మొత్తం ఐదు మండలాల్లో సుమారు 1000 మంది పోలీసు బలగాలు మోహరించాయి.
పిన్నెల్లి, మాదలలో పెట్రో బాంబులు స్వాధీనం
వైసీపీ నేతల ఇళ్లల్లో పెట్రో బాంబులు, కత్తులు, రాళ్లు, ఖాళీ బీరుసీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని చోట్ల కూడా బాంబులు ఉండే అవకాశం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. వైసీపీ నాయకులు ఆధిపత్యం కోసం టీడీపీ వారిని భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నంలోనే ఈ పెట్రోలు బాంబులు, మారణాయుధాలు సిద్ధం చేసుకున్నట్లు అటు పోలీసులతో పాటు ఇటు సామాన్య ప్రజలు భావిస్తున్నారు. ముందస్తు సమాచారంతో పోలీసులు బుధవారం రాత్రి మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఇంటింటా సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులైన చింతపల్లి పెద్దసైదా, చింతపల్లి నన్నే గృహాల్లో పెట్రో బాంబులు బయటపడ్డాయి. టీడీపీ నాయకులైన షేక్ జానీబాష ఇంటిపైన గులకరాళ్లను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు వైసీపీకి చెందిన ముగ్గుర్ని, టీడీపీకి చెందిన ముగ్గుర్ని బుధవారం రాత్రే అదుపులోకి తీసుకున్నారు. ముప్పాళ్ల మండలం మాదలలో పోలీసు తనిఖీల్లో వైసీపీ నాయకుడు గుంటూరు సైదా ఇంట్లోని బాతరూంలో 29 పెట్రోల్ బాంబులను గుర్తించారు. సత్తెనపల్లి రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఐ హజరత్తయ్య గురువారం వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ బిందుమాధవ్ మాచర్లలో తిష్ట వేసి పోలీసు బృందాలకు సూచనలు చేస్తున్నారు. రింగురోడ్డు, పురపాలక సంఘం కార్యాలయం ప్రధాన రహదారి, నెహ్రూనగర్లలో ముళ్ల కంచెలు వేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
నిందితుల కోసం గాలింపు..
మంగళవారం కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి చేసిన వైసీపీ గూండాల కోసం పోలీసులు ప్రత్యేక బలగాలను దింపి గాలింపు చర్యలు చేపట్టారు. మండలంలోని ప్రతి గ్రామంలో సోదాలు చేస్తున్నారు. దీంతో దాడులకు పాల్పడిన రౌడీ మూకలు గ్రామాల నుంచి పారిపోయారు. పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన ఘర్షణ, విధ్వంసాలకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మాచర్ల పట్టణంతోపాటు గ్రామాలను జల్లెడ పడుతున్నారు.
ప్రజలు విలవిల
మంగళవారం నాటి సంఘటనలతో జిల్లా అంతటా 144 సెక్షన కొనసాగుతుంది. దీంతో పోలీసులు దుకాణాలను తెరవనీయడంలేదు. రెండు రోజులుగా బయటకు అడుగుపెట్టేందుకు ప్రజలు భీతిల్లిపోతున్నారు. నిత్యావసరాలకు, తాగునీటికి సైతం విలవిల్లాడుతున్నారు. బయటకు వెళ్లి ఏం తెచ్చుకోవాలన్నా భయంతో ఉన్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు చిన్న చిన్న వ్యాపారులపై ఆంక్షలు సడలించినా పూర్తిస్థాయిలో నిత్యావసర వస్తువులు అందడం లేదు. ఇదే అదునుగా వ్యాపారులు అధిక రేట్లకు అమ్ముతున్నారు. 144 సెక్షన ఇంకెంతకాలం కొనసాగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సీఎంవోకు పిన్నెల్లి సోదరులు..
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలు గురువారం పోలీసు ఎస్కార్ట్తో వెళ్లారు. శుక్రవారం విదేశాలకు వెళ్లనుండడంతో జగనను కలిసేందుకు సోదరులిద్దరూ వెళ్లారు.