అక్రమాలకు అడ్డా
ABN , Publish Date - Jun 25 , 2024 | 12:18 AM
మండల లెవల్ స్టాక్(ఎంఎల్ఎస్) పాయింట్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం అక్రమ రవాణకు కేంద్ర బిందువులుగా మారాయి.
గుంటూరు, జూన్ 24(ఆంధ్రజ్యోతి): మండల లెవల్ స్టాక్(ఎంఎల్ఎస్) పాయింట్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం అక్రమ రవాణకు కేంద్ర బిందువులుగా మారాయి. వీటిల్లో పనిచేస్తున్న కొంతమంది అఽధికారులు రేషన్ మాఫియా, రైస్మిల్లర్లతో చేతులు కలిపి నేరుగా వాటి నుంచి లారీల్లోనే బియ్యం దారి మళ్లించారు. పలుమార్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసు అధికారులు దాడులు చేసి పట్టుకొన్నా నామమాత్రపు కేసులతోనే సరిపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది పెద్దల అండదండలు మాఫియాకి దండిగా లభించడంతో పేదలకు అందాల్సిన సరుకులు నల్లబజారుకు తరలిపోయాయి. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా గత వారంలో బాధ్యతలు స్వీకరించిన నాదెండ్ల మనోహర్ ఈ ఎంఎల్ఎస్ పాయింట్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు దృష్టి సారించారు. అందులో భాగంగా రెండు రోజుల్లో వాటిని తనిఖీ చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంబంధిత అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
రేషన్ సరుకులు డీలర్లకు చేర్చడంలో ఎంఎల్ఎస్ పాయింట్లది కీలకభూమిక. బస్తాకి 50 కేజీలు లెక్క కట్టి డీలర్లకు సరఫరా చేస్తున్నారు. అయితే ఒక్కో బస్తాలో కేజీ నుంచి 2 కేజీల తరుగు వస్తుందని డీలర్లు మొత్తుకొంటున్నా తూకం మాత్రం ఇన్ఛార్జ్లు వేయడం లేదు. కనీసం బిల్లులు కూడా ఇవ్వడం లేదని డీలర్లు వాపోతున్నారు. మరోవైపు డీలర్లు తూకం వేసి ఎండీయూలకు ఇవ్వాల్సి వస్తున్నది. దీంతో డీలర్ తీవ్రంగా నష్టపోతున్నాడు. ఇలా ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్ఛార్జ్లు బియ్యాన్ని మిగుల్చుకొని నేరుగా వాటి వద్ద నుంచే రైసుమిల్లులకు తరలిస్తున్నారు. ప్రతీ నెలా రెండు నుంచి నాలుగు లారీల లోడ్లు వరకు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో పోలీసు శాఖ ఒక దఫా పాతగుంటూరు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి మాఫియాకి లారీ వెళ్లగా దానిని పట్టుకొని కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు జోక్యం చేసుకొని కొద్ది రోజుల్లోనే పోలీసులు అరెస్టు చేసిన మాఫియా నేతకు బెయిల్ వచ్చేలా చేశారు. విజిలెన్స్ అధికారులు ఎన్నికలకు ముందు మూడు లారీల బియ్యాన్ని పట్టుకోవడం పెద్ద సంచలనమే సృష్టించింది. దానిపై కేసుల విషయంలో పకడ్బందీగా పెట్టలేదు. ఈ విధంగా అక్రమాలకు అడ్డాగా మారిన ఎంఎల్ఎస్ పాయింట్లలో ప్రక్షాళన జరిగితేనే పేదలకు సక్రమంగా సరుకులు అందుతాయి. దీనిపై మంత్రి మనోహర్ దృష్టి పెట్టడంతో అక్రమార్కులు బెంబేలెత్తుతున్నారు. లెక్కలను సరిచేసే పనిలో నిమగ్నమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఎండీయూ వ్యవస్థ అవసరమా...!
పౌరసరఫరాల పంపిణీ చట్టం ద్వారా రేషన్ డీలర్ల వ్యవస్థని దశాబ్ధాల క్రితమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఈ వ్యవస్థ ద్వారానే గత నాలుగేళ్ల క్రితం వరకు సరుకుల పంపిణీ సజావుగా జరిగింది. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత ఏడాదికి ఎండీయూ వ్యవస్థని తీసుకొచ్చింది. తానేదో ప్రజలను ఉద్ధరిస్తున్నట్లుగా అప్పట్లో సీఎం జగన్ కలరింగ్ ఇచ్చారు. డీలర్లను నిబంధనలకు విరుద్ధంగా స్టాకిస్టులుగా మార్చారు. దీని వలన అటు డీలర్లకు కమీషన్తో పాటు ఎండీయూలకు ఒక్కో వాహనానికి దాదాపుగా రూ.21 వేల వరకు చెల్లించాల్సిన పరిస్థితి. ఇది అదనపు భారంగా పరిణమించింది. రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేయాలన్న లక్ష్యంతో ఎండీయూ వ్యవస్థని తీసుకొచ్చి చివరికి రోడ్ డెలివరీగా మార్చారు. మరోవైపు ఎండీయూలు అంతా రేషన్ మాఫియాతో చేతులు కలిపారు. క్రమంగా వారి ఆధీనంలోకి వెళ్లారు. కొందరైతే నేరుగా రైసుమిల్లుల యజమానులతో ఒప్పందాలు చేసుకొని బియ్యాన్ని అక్రమ రవాణ చేస్తున్నారు. ప్రజలకు బియ్యానికి బదులుగా కేజీకి రూ.15 నగదు ఇచ్చి వీళ్లు రైసుమిల్లర్లకు రూ.22కు విక్రయిస్తూ రూ. లక్షలు పోగేసుకొంటున్నారు. గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల వద్దకు వెళ్లి వాలిపోతుంటుంది. వీటన్నింటిపై జిల్లాకు చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టి పెట్టి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలానే ఎండీయూ వ్యవస్థ అవసరమో, లేదోనన్న దాని పైనా సమీక్ష చేసి తుది నిర్ణయం తీసుకోవాలి.