ప్రజల తీర్పును గౌరవిస్తూ బాధ్యతగా పనిచేస్తాం
ABN , Publish Date - Jun 05 , 2024 | 01:00 AM
బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తీర్పును గౌరవిస్తూ బాధ్యతగా పని చేస్తానని కూటమి ఎంపీగా గెలుపొందిన తెన్నేటి కృష్ణప్రసాద్ తెలిపారు.
![ప్రజల తీర్పును గౌరవిస్తూ బాధ్యతగా పనిచేస్తాం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బాపట్ల, జూన్ 4 : బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తీర్పును గౌరవిస్తూ బాధ్యతగా పని చేస్తానని కూటమి ఎంపీగా గెలుపొందిన తెన్నేటి కృష్ణప్రసాద్ తెలిపారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ముగియగానే మీడియా సెంటర్లో ఆయన మాట్లాడుతూ మొదటిసారిగా ఎన్నికలలో పోటీ చేసిన తనపై ప్రజలు నమ్మకం ఉంచి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో కూటమి అ భ్యర్థులు విజయం సాధించటం సంతోషదాయకమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తానని చెప్పారు. ఏ ఒక్క హామీని మరిచిపోకుండా అమలు చేస్తానన్నారు. ఒక అధికారిగా ఎంతో బాధ్యతగా పని చేసిన తాను కేపీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు అందిస్తూ వచ్చానని, ఇకపై ప్రజాప్రతినిధిగా ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతానని చెప్పారు. అధికారం చేయటానికి కాకుండా సేవ చేయటం కోసమే తాను వచ్చినట్లు తెలిపారు.
ప్రజల ఆకాంక్ష నెరవేరింది : ఎమ్మెల్యే నరేంద్రవర్మ
ప్రజల ఆకాంక్ష నెరవేరిందని తిరిగి రాష్ర్టానికి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని కూటమి ఎమ్మెల్యేగా గెలుపొందిన వేగేశన నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల నియోజకవర్గంలో నాలుగుసార్లుగా తెలుగుదేశం పార్టీ ఓటమిపాలవుతూ వచ్చిందన్నారు. మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో పోటీ చేసిన తనను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు తన విజయానికి కృషి చేసినందుకు అభినందనలు తెలిపారు.