మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా నేరం
ABN , Publish Date - Jun 27 , 2024 | 01:25 AM
మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా నేరమని, ఈ కేసుల్లో నింధితులకు కఠిన శిక్షలు ఉంటాయని సీనియర్ సివిల్ న్యాయాధికారి శ్రీనివాసరావు అన్నారు.

సీనియర్ సివిల్ న్యాయాధికారి శ్రీనివాసరావు
మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నేపథ్యంలో అవగాహన
గురజాలటౌన్, జూన్ 26: మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా నేరమని, ఈ కేసుల్లో నింధితులకు కఠిన శిక్షలు ఉంటాయని సీనియర్ సివిల్ న్యాయాధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని పల్లెగుంత మోడల్ స్కూల్లో బుధవారం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నాలుగవ అదనపు జిల్లా న్యాయాధికారి శరత్ మత్తు పదార్థాలకు బానిస అవడం వలనే కలిగే అనార్థాలను వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బండి వీరభద్రుడు, సీనియర్ న్యాయవాది షేక్ జానీబాషా, ఎస్ఐ సౌందర్ రాజన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వాగ్ధేవీ ఫార్మసీ కళాశాలలో సెబ్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యాన మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సెబ్ ఎస్ఐ రవికుమార్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ స్వప్న, డైరెక్టర్ బడిదెల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
- న్యాయాధికారి శ్రీరాం శ్రీనివాస్ కల్యాణ్
మాచర్ల రూరల్ : యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయాధికారి శ్రీరాంశ్రీనివాస్ కల్యాణ్ అన్నారు. పట్టణంలోని ఎస్వీఆర్ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగం, దుష్ప్ర భావాలు, నేరం - శిక్షలు వంటి అంశాలపై విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏజీపీ గొర్రె వెంకటేశ్వర్లు, న్యాయవాదులు గంగుల శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ సుబ్బారావు పాల్గొన్నారు.