ఐదు కోట్ల మంది ఆత్మగౌరవం అమరావతి
ABN , Publish Date - Jun 04 , 2024 | 01:10 AM
ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల ఆత్మగౌవరం అమరావతి రాజధాని అని భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు.
![ఐదు కోట్ల మంది ఆత్మగౌరవం అమరావతి](https://media.andhrajyothy.com/media/2024/20240603/3tlr1_copy_6076ab94cd.jpg)
తుళ్లూరు, జూన్3: ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల ఆత్మగౌవరం అమరావతి రాజధాని అని భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసిన సీఎం జగన్రెడ్డి అండ్ కో కనుమరుగు అవుతుందని అన్నారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు, రైతు కూలీలు, మహిళలు, ధర్నా శిబిరాలు, ఇళ్ల వద్ద నుంచి చేస్తున్న ఆందోళనలు సోమవారం నాటికి 1630వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. మంగళవారం జరిగే ఎన్నికల కౌంటింగ్లో రాజధాని లేకుండా చేసిన వైసీపీ అడ్రస్ గల్లంతేనని స్పష్టం చేశారు. అన్ని వ్యవస్థలు జగన్రెడ్డి ప్రభుత్వంలో నిర్వీర్యంగా మారాయన్నారు. కూలీలకు ఉపాధి లేదు, అమరావతి, పోలవరంతో సహా ఏ ప్రాజెక్టు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇటువంటి నియంత పాలన ప్రజలు ఒప్పుకోరన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఓటమిని జగన్రెడ్డి చూడబోతున్నారన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలగించి బిల్డ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని 29గ్రామాలలో రైతుల ఆందోళనలు నిరసన దీక్షలు కొనసాగాయి.