తూర్పుసత్రం భూమి లీజును రద్దు చేయాలి
ABN , Publish Date - May 22 , 2024 | 12:48 AM
బాపట్ల పట్టణ నడిబొడ్డున ఉన్న తూర్పుసత్రం భూమి లీజును వెంటనే రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నాయకుడు అన్నం సతీష్ ప్రభాకర్ మంగళవారం దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు.
బాపట్ల,మే 21 : బాపట్ల పట్టణ నడిబొడ్డున ఉన్న తూర్పుసత్రం భూమి లీజును వెంటనే రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నాయకుడు అన్నం సతీష్ ప్రభాకర్ మంగళవారం దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. పూర్వం పేరం గరుడాచలం నాయుడు దానం చేసిన తూర్పుసత్రం భూమిలో 78 సెంట్లు నెలకు 46 వేల రూపాయల చొప్పున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారికి లీజుకివ్వటాన్ని అన్నం సతీష్ తీవ్రంగా ఖండించారు. బాపట్ల పరిసర ప్రాంతాలలోని పేదలు, సొంత ఇల్లు లేని వారు, ఇతరులు దశదిన కర్మలు నిర్వహించుకోవటానికి, పేద వితంతు మహిళలు ఆ సమయంలో తలదాచుకోవటం కొరకు, పేద విద్యార్ధులకు పారితోషకాలు ఇవ్వటం కొరకు ఏర్పాటు చేసిన సంపూర్ణ ధార్మిక సంస్థ తూర్పుసత్రమని ఆయన అన్నారు. ప్రస్తుతం సదరు స్థలంలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారికి ఆయిల్ అవుట్లెట్ కొరకు అత్యంత విలువైన స్థలాన్ని అతి తక్కువ నామమాత్రపు లీజుకిచ్చారన్నారు. సదరు సంస్థ వారు ఆయిల్ ఔట్లెట్ పెట్టటం వలన కర్మకాండల కొరకు వచ్చే ప్రజలు కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బందిగా ఉంటుందని అన్నం సతీష్ అన్నారు. ఇప్పటికే తాత్కాలిక లీజుపై జాతీయ రహదారి నిర్మాణం చేస్తున్న గుత్తేదారు సంస్థ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పక్షాలు, కాపుసేవాసంఘంవారు సదరు లీజును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దాత ఆశయాలను నెరవేర్చుటకు, ఆస్తులు పరిరక్షణ చేయవల్సిందిగా అన్నం సతీష్ కోరారు. హిందూ సమాజం, కాపు సామాజక వర్గం మనోభావాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం లీజును తక్షణమే రద్దు చేసి సత్రం భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పని చేస్తానని సానుకూలంగా స్పందించినట్లు అన్నం సతీష్ తెలిపారు.