CBI : ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో విశ్రాంత ఐఆర్ఎస్ అధికారికి జైలు శిక్ష
ABN , Publish Date - Dec 31 , 2024 | 06:01 AM
ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి, గతంలో కాకినాడ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన రాయభరపు వెంకట లక్ష్మీనరసింహారావుతోపాటు...

ఆయన భార్యకు కూడా
విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి, గతంలో కాకినాడ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన రాయభరపు వెంకట లక్ష్మీనరసింహారావుతోపాటు ఆయన భార్య రాయభరపు గౌరీరత్నానికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.రెండు లక్షలు చొప్పున జరిమానా విధిస్తూ విశాఖలోని సీబీఐ కేసుల న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సీఎన్ మూర్తి సోమవారం తీర్పు వెలువరించారు. నరసింహారావు సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్నప్పుడు 2007 జూలై నుంచి 2011 ఆగస్టు వరకు అక్రమంగా ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ అధికారులు స్పందించి నరసింహరావుతోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న స్థిర, చరాస్తుల వివరాలను సేకరించారు. నరసింహరావు తన వాస్తవ ఆదాయం కంటే అదనంగా రూ.31,20,080 విలువైన స్థిర, చరాస్తులను కొనుగోలు చేసినట్టు నిర్ధారణ అయింది.