మా పేర్లు ఎక్కడ?
ABN , Publish Date - May 08 , 2024 | 12:08 AM
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో రెండో రోజు గందరగోళం నెలకొంది.
![మా పేర్లు ఎక్కడ?](https://media.andhrajyothy.com/media/2024/20240504/7gpm1_35539f9e4a.jpg)
ఓటింగ్లో రెండో రోజూ గందరగోళమే
గోపాలపురం, మే 7: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో రెండో రోజు గందరగోళం నెలకొంది. మొదటి రోజు గోపాలపురం నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న ఆయా ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం 8గంటలకే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. అయితే అక్కడ తమ పేర్లు జాబితాలో కనిపించకపోయేసరికి హైరానపడ్డారు. ఉదయం 8.30కు ప్రారంభించాల్సిన బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 3.30కు ప్రారంభించారు. రెండో రోజు బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను బీఆర్ అంబేడ్కర్ గురుకుల ఆశ్రమ పాఠశాల నుంచి తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. బ్యాలెట్ ఓటు వేసేందుకు ఆయా ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ఉద్యోగులు మొదట గురుకుల పాఠశాలకు వెళ్లి అక్కడ నుంచి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. 2వ రోజు జాబితాలో తమ పేర్లు కనిపించకపోయే సరికి బ్యాలెట్ ఓటర్లు నిర్వాహకులను నిలదీశారు. చేసేదేమి లేక గోపాలపురం నియోజకవర్గ పరిధిలో పని చేసే వారికి మాత్రమే మంగళవారం బ్యాలెట్ ఓటు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశామని, మిగిలిన వారు బుధవారం రావాలని తెలపడంతో అక్కడికి వచ్చిన వారంతా ఆగ్రహంతో ఊగిపోయారు. ఉద్యోగుల ఓట్లు ప్రభుత్వానికి అనుకూలంగా పడవనే దురుద్దేశంతోనే పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను గందరగోళం సృష్టిస్తున్నారని ఓటు వేసేందుకు వచ్చిన పలువురు చెబుతున్నారు.