వలంటీర్లపై వేటు!
ABN , Publish Date - Mar 22 , 2024 | 12:37 AM
ఎన్నికల కమిషన్ ఆదేశాలు బేఖాతర్ చేశారు.. ఎప్పుడూ పిలిచినట్టే నాయ కుడు పిలిచాడు కదా అని ఎరక్కపోయి వెళ్లి ఇరుక్కుపోయారు.. రాజ మహేంద్రవరం ఎంపీ భరత్రామ్ అత్యుత్సాహానికి ఏకంగా 23 మంది వలంటీర్లు బలైపోయారు.
![వలంటీర్లపై వేటు!](https://media.andhrajyothy.com/media/2024/20240313/mcms_9deab8d59b.gif)
ఈసీ ఆదేశాలు బేఖాతర్
ఎంపీ మీటింగ్కు వెళ్లడమే కారణం
ఆర్వోకు అందిన ఫిర్యాదు
24 గంటల్లో విచారణ పూర్తి
44వ డివిజన్ వలంటీర్లపై చర్యలు
ఎంపీని వదిలేసిన అధికారులు?
విచారణ పేరుతో జాప్యం
మండిపడుతున్న బాధితులు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
ఎన్నికల కమిషన్ ఆదేశాలు బేఖాతర్ చేశారు.. ఎప్పుడూ పిలిచినట్టే నాయ కుడు పిలిచాడు కదా అని ఎరక్కపోయి వెళ్లి ఇరుక్కుపోయారు.. రాజ మహేంద్రవరం ఎంపీ భరత్రామ్ అత్యుత్సాహానికి ఏకంగా 23 మంది వలంటీర్లు బలైపోయారు. దిక్కుతోచని స్థితిలో వలంటీర్లు గిజగిజలాడి పోతు న్నారు. నేతల ఒత్తిళ్లకు లొంగి చివరకు బలి పశువులుగా మారిపోయారు. అయితే సమావేశం నిర్వహించిన ఎంపీ భరత్పై నేటి వరకూ చర్యలు లేకపోవడంపై వలంటీర్లు మండిపడుతున్నారు.ఎన్నికల సమయంలో వలంటీర్లను వినియోగిం చవద్దని ఎన్నికల కమిషన్ ప్రత్యేకించి హెచ్చరిం చినా వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు. రాజ మహేంద్రవరంలో ఈ నెల 19వ తేదీన ఎంపీ భరత్ రామ్ నిర్వహించిన రహస్య సమావేశానికి 44 డివిజన్కు సంబంధించిన 23 మంది వలం టీర్లు వెళ్లారు. ఇదే పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది.. వలంటీర్ల సస్పెండ్ చేయించింది. 44వ వార్డు 76వ సచివాలయంలో 10 మంది, 77వ సచివాలయంలో 13 మంది వలం టీర్లను సస్పెండ్ చేసినట్టు ఆర్వో దినేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వలం టీర్లను ఇప్పటి వరకూ పింఛన్లు పంపిణీ, అధి కార వైసీపీకి అవసరమైన సమాచారాన్ని సేకరిం చడం తదితర కార్యక్రమాలకు ఉపయోగించుకు న్నారు. వైసీపీ మీటింగ్లకు వాళ్లే కీలకంగా వ్యవ హరించేవారు. చాలా వరకూ జనసమీకరణ చేసే వారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోర్టు ఆదేశా లతో వలంటీర్లు ఎన్నికలకు దూరం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే వైసీపీ నాయకులకు అసలు చిక్కు వచ్చిపడింది. నిన్నటి వరకూ నాయ కులు కార్యకర్తలను పట్టించుకోకుండా వలంటీర్లకే పెద్దపీట వేసేవారు.వైసీపీ కార్యకర్తలను పట్టించు కోలేదు. దీంతో ఎన్నికల వేళ వైసీపీ నాయకులు ప్రచారం చేయడానికి డబ్బులిస్తేనే కానీ కార్యక ర్తలు ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయి.
కార్యకర్తలు కినుక..
వార్డులు, గ్రామాల్లో ఎక్కువ మంది వలంటీర్లకే పరిచయం. పింఛన్లు, ప్రభుత్వ పథకాలపై అమ లుపై గత ఐదేళ్లుగా జనంతో ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులంతా ప్రతి విషయానికి వలంటీర్ల మీదే ఆధారపడుతున్నారు. అయితే వలంటీర్లను ఎన్నికల్లో దూరంగా ఉంచాలని కోర్టు ఆదేశించడంతో వైసీపీ గొంతులో వెలక్కాయ పడి నట్టు అయింది. కానీ దేన్నయినా ధిక్కరించే నైజం అలవరచుకున్న కొందరు వైసీపీ నేతలు వలంటీర్ల మీద ఒత్తిడి తెచ్చి ఇంటింటా ప్రచారం చేయించు కునే పనిలో ఉన్నారు. అధికార వైసీపీ నేతల ప్రలోభాలకు,ఒత్తిళ్లకు లొంగి వైసీపీ మీటింగ్లకు హాజరవుతున్నారు. ఈ వ్యవహరం బయటకు వస్తుండడంతో వలంటీర్లు ఎన్నికల కమిషన్ వేటుకు గురవుతున్నారు.
వల వేసినా..
వలంటీర్లుగా పనిచేస్తూ ప్రభుత్వం నుంచే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రూపంలో గౌరవ వేతనం పొందుతున్నారు.ఈ పరిస్థితుల్లో వలంటీర్లు రాజ కీయ పార్టీకి ఎలా పనిచేస్తారని ప్రశ్నించి వారిని ఎన్నికల కమిషన్ దూరం పెట్టిన సంగతి తెలి సిందే. నాయకులతో కలిసి వెళితే కేసులు పెడ తామని,జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. జిల్లాలో 9300 మంది వలంటీర్లు ఉండేవారు. ప్రస్తుతం 8 వేల మంది ఉన్నారు. వారందరికీ ఇటీవల వైసీపీ నేతలు నియోజకవర్గాల వారీ గిఫ్ట్లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్ని కలు దగ్గరకు వచ్చే సమయంలో డబ్బు కూడా ఇస్తామని ప్రలోభాలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల సిటీ వైసీపీ అభ్యర్థి, ఎంపీ మార్గాని భరత్ బూత్కమిటీ పేరుతో ఏర్పాటు చేసిన మీటింగ్లకు వలంటీర్లు హాజరయ్యారు.ఈ విషయం బయటకు రావడంతో పాటు టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కమిషనర్, సిటీ ఆర్వో కె.దినేష్కుమార్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆరా తీసి 23 మంది వలంటీర్లను సస్పెండ్ చేశారు. దీంతో వలంటీర్లతో పాటు వైసీపీ ఖంగుతిన్నది. ఈ నేపథ్యంలో మిగతా వలంటీర్లు అలర్ట్ అయ్యారు. గతంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఉద్యోగు ల్లో కూడా ఆందోళన మొదలైంది. ఇటీవల భూ ములు సేకరించకుండానే వేలాది మంది లబ్ధిదార్లకు పట్టాలు పంపిణీ చేసిన రెవెన్యూ అధికారులపై కూడా ఫిర్యాదులు చేయడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతుండడం గమనార్హం.