Share News

గ్రామస్థుల దాడిలో వ్యక్తి మృతి

ABN , Publish Date - Apr 04 , 2024 | 12:58 AM

అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిపై భయంతో గ్రామస్థులు దాడి చేయడంతో మృతి చెందాడు. కొవ్వూరు మండలం సీతంపేటలో ఈ దారుణం జరిగింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం మండలంలోని సీతంపేట గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నిక్కరు ధరించి గ్రామంలో ఒక ఇంటిముందు తిరుగుతున్నాడు.

గ్రామస్థుల దాడిలో వ్యక్తి మృతి

కొవ్వూరు, ఏప్రిల్‌ 3: అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిపై భయంతో గ్రామస్థులు దాడి చేయడంతో మృతి చెందాడు. కొవ్వూరు మండలం సీతంపేటలో ఈ దారుణం జరిగింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం మండలంలోని సీతంపేట గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నిక్కరు ధరించి గ్రామంలో ఒక ఇంటిముందు తిరుగుతున్నాడు. ఇటీవల సోషల్‌ మీడియాలో రాత్రి సమయంలో ఇంటిపై దాడిచేసి దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌కు సంబంధించిన వ్యక్తి అనుకుని ఆ ఇంటిలోని మహిళ ఆకుల నర్సవేణి పెద్ద పెద్ద కేకలు వేసింది. దీంతో గ్రామస్థులు గుమిగూడి ఆ వ్యక్తిపై మూకుమ్మడి దాడి చేశారు. అపస్మారకస్థితిలో కిందపడిపోయిన వ్యక్తిని వదిలిపెట్టి గ్రామస్థులు ఎవరికి వారు వెళ్లిపోయారు. ఉదయం చూసేసరికి అక్కడేపడి ఉన్న వ్యక్తిని చూసి స్థానికులు కొవ్వూరు రూరల్‌ పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ కె.సుధాకర్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని పరిశీలించగా మృతి చెందాడని ధ్రువీ కరించారు. దాడి చేసిన వారిని గుర్తించి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఎటువంటి వివరాలు తెలియరాలేదని, ఆచూకీ తెలిసినవారు కొవ్వూరు రూరల్‌ ఎస్‌ఐ 9440796623, సీఐ 9440796621కు సమాచారం అందించాలన్నారు. మద్దూరులంక వీఆర్వో జి.వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొవ్వూరు రూరల్‌ ఎస్‌ఐ కె.సుధాకర్‌ తెలిపారు.

Updated Date - Apr 04 , 2024 | 12:58 AM