మళ్లీ పండక్కే!
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:37 AM
361 రోజులు ఎదురు చూసిన నాలుగు రోజుల పండుగ సరదా సరదాగా మూడు క్షణాల్లో గడిచిపోయింది. సొం తూ రుతో సంతోషాన్ని పంచుకొని చుట్టాలు సొంతగూళ్ల దారి పట్టారు. వెళ్లొస్తాం ‘మళ్లీ పండక్కి’ వస్తాం..
నాలుగు రోజులు.. మూడు క్షణాలుగా మారిన వైనం
పట్టణాల వైపు పల్లెజనం ఉరుకులు పరుగులు
బస్సులు..రైళ్లు ఫుల్.. రోడ్లపై భారీగా వాహనాలు
శని, ఆదివారాల్లో మరిన్ని ప్రత్యేక బస్లు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
361 రోజులు ఎదురు చూసిన నాలుగు రోజుల పండుగ సరదా సరదాగా మూడు క్షణాల్లో గడిచిపోయింది. సొం తూ రుతో సంతోషాన్ని పంచుకొని చుట్టాలు సొంతగూళ్ల దారి పట్టారు. వెళ్లొస్తాం ‘మళ్లీ పండక్కి’ వస్తాం.. అంటూ తీపి జ్ఞాపకాలతో బరువెక్కిన గుండెలతో.. చెమర్చిన కళ్లతో.. కులాసా కబుర్లను చెంగున కట్టుకొని.. కష్టసుఖాలను మన సున పెట్టుకొని మళ్లీ ఉరుకుల పరుగుల జీవనంలోకి బయ లుదేరింది బంధుగణం. దీంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోగా.. కార్లు, బైకులతో రహదారులు నిండిపోయాయి.
సంక్రాంతికే ప్రత్యేకం
ఏడాదిలో ఏ పండుగకూ లేని ప్రత్యేకత సంక్రాంతికి ఉంది. ఈ పండుగ భోగి రోజు మొదలై నాలుగో రోజున ముక్క నుమతో ముగుస్తుంది. ముక్కనుమ రోజున అధిక శాతం మంది నైవేద్యాలు పెట్టుకుంటారు. బంధుగణానికి మాంసా హారంతో పసందైన విందును వండి వడ్డిస్తారు. ఆ రోజుతో ఆ ఏడాదికి సంక్రాంతికి వీడ్కోలు పలుకుతారు. నాలుగు రోజుల పాటు ఉల్లాసంగా గడిపి ఎన్నో ఊసులను మనసు నుంచి దించుకున్నారు. మరెన్నో కబుర్లను మన సున ముడేసుకు న్నారు. పండక్కి మా ఊరెళ్తున్నాం.. చుట్టాలింటికి వెళ్తున్నాం.. అంటూ ఇరుగు పొరుగు వారికి నెల ముందు నుంచే సం బరంగా చెప్పుకొని రెక్కలు కట్టుకుని వాలిపోయారు. నాలుగు రోజులు మూడు క్షణాల్లో గడిచిన తర్వాత అప్పుడే పండుగ అయిపోయిందా!? అనుకుంటూ ఉసూరు మంటూ నగరాలకు బయలుదేరారు.సినిమాలు,షికార్లు, కోడిపందేల్లో జరిగిన ఎన్నో విషయాలను వారితో తీసుకెళ్లారు.ఆ తరువాత బంధు గణం బ్యాగులు సర్దుకొని తిరిగి పయనమవుతారు.ఈ నాలుగు రో జుల పండుగ అయిపోయాక నగరబాట పట్టిన తన వారి కోసం పల్లె మళ్లీ యథావిధిగా ఎదురుచూస్తూనే ఉంటుంది.
పల్లె ఎదురుచూపు..
సంక్రాంతికి మరో విశేషం ఉంది. ఆ పండుగకు సుమారు వారం రోజుల పాటు నగరాలు బోసిపోతాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబయి వంటి నగరాల్లో ట్రాఫిక్ తగ్గి పోయి రహదారులు ఖాళీగా దర్శనమిస్తాయి.ప్రవాసులతో కలుపుకొని బంధు ప్రవా హమంతా ఉరకలేసుకుంటూ పల్లె ఒడిలోకి చేరిపోతుంది. ఏడాదంతా ఉరుకులు పరుగుల జీవనంలో మమేకమైన పల్లెజనం పండుగకు వచ్చి కాస్త సేద తీరతారు. సంక్రాంతికి కళకళలాడిన పల్లెలు చుట్టాలు తిరుగుదారి పట్టడంతో ఖాళీగా దర్శనమిస్తుంటాయి. ఈ ఏడాదీ అదే కని పించింది. కనుమ రోజు నుంచి మళ్లీ చాలా మంది పట్టణం బాటపట్టారు. ముక్కనుమ రోజు బుధవారం మరింతగా పెరిగింది. గురువారం దాదాపు గా అందరూ తమతమ ఇళ్లకు చేరిపోతారు.ఆ తరువాత నగరాల్లో హడావుడి మొదలైపోగా..పల్లెలు వెలితిగా కనిపిస్తాయి.
రైళ్లన్నీ ఫుల్..
పండుగకు ప్రధాన ప్రయాణ సాధనాలు రైళ్లు. పండుగ ప్లాన్ ఎలా ఉన్నా.. ముందుగా నెలల ముందే రానుపోను రిజర్వేషన్లు చేయించుకుంటారు. రిజర్వేషను దొరకని వాళ్లు ఏదోలా పల్లె ఒడిలో వాలిపోతారు. ఇప్పుడు ఈ ఏడాది పండుగకు వీడ్కోలు పలకడంతో రైళ్లు మరింత కిక్కిరిసి నడుస్తున్నాయి. రైల్వే ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నా రద్దీ క్లియర్ కావడం లేదు. ఇంటర్సిటీలు సరిపడా లేకపోవడంతో ప్రయాణపాట్లు తప్పడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వెళ్లే రైళ్లు ఇసుకేస్తే రాలనంత ప్రయాణికులతో నడుస్తున్నాయి. రాజమండ్రి రైల్వే స్టేషను అటు కోనసీమ, ఇటు ఏజెన్సీ ప్రాంతాలకు కూడా గేట్వే వంటిది. సుదూర ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి రైళ్లు అందుబాటులో ఉన్నా యి. దీంతో సాధారణ రోజుల్లో రోజులు 10వేల మంది ప్రయా ణాలు సాగిస్తే.. సంక్రాంతికి ఆ సంఖ్య రెట్టింపు అవుతుంది.
రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 17 : హైదరాబాద్, బెంగళూరు నుంచి పెద్ద పండక్కి సొంతూళ్లకు వచ్చిన జిల్లా ప్రయాణికులు తిరుగు పయనమవుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్కు ఎక్కువ మంది తిరుగు ప్రయాణాలు ప్రారంభించడంతో జిల్లా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. తిరుగుప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించింది. బుధవారం రాత్రి నుంచి ఈ స్పెషల్ సర్వీసులు మొదలయ్యాయి. రాజమహేంద్రవరం, గోకవరం, కొవ్వూరు, నిడదవోలు డిపోల నుంచి ఏడు షెడ్యూలు బస్సులతో పాటు మరో ఏడు స్పెషల్ సర్వీసులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లాయి. ఇవన్నీ ఫుల్రష్గా బయలుదేరి వెళ్లినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీటితో పాటు శ్రీకాకుళం, ఇచ్ఛాపురం ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్కు షెడ్యూలు బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్కు వయా విజయవాడ సూపర్ లగ్జరీ బస్సులకు రూ.830లు ఛార్జి చేస్తుండగా, వయా ఖమ్మం రూ.790 వసూలు చేస్తున్నారు. ఇంద్ర ఏసీ సర్వీసుకు రూ.1,050 ఛార్జిగా ఉంది. స్పెషల్ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తుండడంతో హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులకు మంచి డిమాండ్ ఏర్పడింది. రైళ్లలో టిక్కెట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో సాధారణ, మధ్యతరగతి ప్రయాణీకులు ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ ఆదివారం వరకూ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడిపేందుకు టైం టేబుల్ సిద్ధం చేసింది. శని, ఆదివారాల్లో హైదరాబాద్కు ప్రయాణీకుల రద్దీ భారీగా ఉండొచ్చనే అంచనాలతో ఆ రెండు రోజుల్లో మరిన్ని స్పెషల్ బస్సులు నడపాలని జిల్లా ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు.
దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్..
ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాయి. ముందస్తు రిజర్వేషన్లు లేనివారు, అప్పటికప్పుడు ప్రయాణాలు సాగించాల్సిన వారు ఎక్కువ మంది ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో టిక్కెట్పై రూ.2 వేల నుంచి రూ.2,500 వరకూ వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండు ఏరియాలో పెద్ద సంఖ్యలో ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. లాలాచెరువు, కోటిపల్లి బస్టాండు వంటి చోట్ల బోర్డింగ్ పాయింట్లు ఉన్నా టిక్కెట్లు బుకింగ్ ఆఫీసులన్నీ ఇక్కడే ఉన్నాయి. పండుగ డిమాండ్ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణీకులను దోచేస్తున్నా రవాణాశాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
సెలవులు పొడిగింపు.. 22 నుంచి స్కూల్స్
రాజమహేంద్రవరం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సెలవులను ప్రభుత్వం రెండు రోజులు పొడిగించిందని డీఈ వో ఎస్.అబ్రహాం తెలిపారు. ఈ నెల 9 నుంచి 18వ తేదీ వరకూ ఇచ్చిన సంక్రాంతి సెలవులను తల్లిదండ్రులు, ఉపా ధ్యాయుల అభ్యర్థన మేరకు 20వ తేదీ వరకూ పొడిగించా రన్నారు. 21వ తేదీ ఆదివారం కావడంతో 22 నుంచి స్కూల్స్ పనిచేస్తాయన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, జడ్పీపీ/ఎంపీపీ, అయిడెడ్ పాఠశాలలకూ వర్తిస్తా యని..ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.