Share News

రికార్డు రూమ్‌ల పరిరక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:20 AM

జిల్లాలోని ముఖ్యమైన ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయంలో రికార్డు రూమ్‌లను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఎస్‌ఎన్‌ఆర్‌ఈ డేటా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులు, అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు.

రికార్డు రూమ్‌ల పరిరక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు

అమలాపురంటౌన్‌, ఆగస్టు 20: జిల్లాలోని ముఖ్యమైన ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయంలో రికార్డు రూమ్‌లను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఎస్‌ఎన్‌ఆర్‌ఈ డేటా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులు, అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ముఖ్యమైన ప్రదేశాలతో పాటు తహసీల్దారు కార్యాలయంలోని రికార్డు రూమ్‌లు, సంక్షేమ హాస్టల్స్‌, ఇసుక రీచ్‌లు, ఇసుక నిల్వ కేంద్రాల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి అమలాపురం కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు అవసరమైన ఇంటర్నెట్‌, విద్యుత్‌ సదుపాయాలను కల్పించాలన్నారు. ఆగస్టు 23లోపు ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నివేదిక అందించాలని సూచించారు. సమావేశంలో ఇండస్ట్రీయల్‌ ఏడీ శివరామకృష్ణ, సంస్థ ప్రతినిధి విష్ణురాజు, గౌతమ్‌, కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 12:20 AM