రత్నగిరిపై పలు అభివృద్ధి పనులకు ఆమోదం
ABN , Publish Date - Jan 30 , 2024 | 12:52 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో పలు అభివృద్ధి పనులకు పాలకమండలి ఆమోదం లభించింది. చైర్మన్ రోహిత్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఈవో రామచంద్రమోహన్ ప్రతిపాదించిన అజెండాపై సభ్యులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
![రత్నగిరిపై పలు అభివృద్ధి పనులకు ఆమోదం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అన్నవరం, జనవరి 29: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో పలు అభివృద్ధి పనులకు పాలకమండలి ఆమోదం లభించింది. చైర్మన్ రోహిత్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఈవో రామచంద్రమోహన్ ప్రతిపాదించిన అజెండాపై సభ్యులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా కొండదిగువ టోల్గేట్ నుంచి సెంటినరీ కాటేజీ వరకు నిర్మించ తలపెట్టిన మెట్లమార్గం అంచనా వ్యయాన్ని రూ.85 లక్షల నుంచి రూ.90 లక్షలకు పెంచేందుకు ఆమోదం లభించింది. రూ.40 లక్షలతో టోల్గేట్ వద్ద నుంచి సత్యగిరి జంక్షన్ వరకు ఘాట్రోడ్డు పాడవడంతో బీటీ రోడ్డు వేసేందుకు ఆమోదించి దేవదాయ కమిషనర్ అనుమతితో చేపట్టాలని నిర్ణయించారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న విద్యాసంస్థల్లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జీతభత్యాలకు రూ.90 లక్షలు సప్లిమెంటరీ బడ్జెట్కు అనుమతి కోరుతూ ప్రతిపాదించగా నిర్ణయాన్ని కార్యనిర్వహణాధికారికి వదిలివేశారు. సత్యగిరి కొండపై నిర్మించిన శివసదన్ కాటేజీ నందు సూట్రూంల అద్దెను 2000 నుంచి 2500కు పెంచాలని నిర్ణయించారు. ఇటీవల నూతనంగా నిర్మించిన ఆదిశంకర్ మార్గ్కు భద్రతా ప్రమాణాల దృష్ట్యా రూ.11.91 లక్షలతో క్రాస్ బేరియర్స్ ఏర్పాటుకు పిలిచిన లోయస్టు టెండర్ ఆమోదించారు. రూ.9 లక్షలతో ప్రకాష్సదన్ కాటేజీ వద్ద ఏర్పాటు చేసిన ర్యాంపునకు బీటీ రోడ్డు వేసేందుకు ఆమోదం లభించింది. ఇటీవల దేవస్థానంలో వాహనాల కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు, ఒక క్లీనర్ను ఔట్సోర్సింగ్పై తీసుకోవాలనే అంశాన్ని ఆమోదించి కమిషనర్ అనుమతి తీసుకోవాలని సూచించారు. రూ.26 లక్షలతో దత్తత ఆలయమైన శంఖవరం ఉమామహేశ్వర దేవస్థానంలో కల్యాణ మండపం అభివృద్ధి పనులు చేపట్టడంపై నియమ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. రూ.3.90 లక్షలతో మిచౌంగ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఘాట్రోడ్డు పనులకు గ్రీన్సిగ్నల్ లభించింది. ఇటీవల పలు వ్యాపార సముదాయాల లైసెన్స్ హక్కులకు నిర్వహించిన వేలం పాటలలో హెచ్చుపాటలను ఆమోదించారు. సమావేశంలో సభ్యులు పేరూరి బద్రీనారాయణ, నక్కా అశ్వని, దోమాడ సుందరరావు, సహాయ కమిషనర్ రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు.