హంగు..ఆర్భాటమే!
ABN , Publish Date - Feb 15 , 2024 | 12:39 AM
గతంలో ఎన్నడు లేనివిధంగా అభివృద్ధి చేశాం.. కావాంటే చూసుకోండి అంటూ గొప్పలు చెప్పుకుంటున్న అధి కార పార్టీ నాయకుల అంచనాలు కొండలు దాటితే వాస్తవికతకు చాలా భిన్నంగా ఉందనే లెక్కలు చెబుతున్నాయి.
![హంగు..ఆర్భాటమే!](https://media.andhrajyothy.com/media/2023/20231205/13_RJY_SRB_17_9a50362aa6.gif)
నగరంలో అటకెక్కిన అభివృద్ధి
ఐదేళ్లగా సమస్యలపై దృష్టి లేదు..
అంచనాలు రూ.350 కోట్లు
సీఎం హామీ రూ.125 కోట్లు
ఇచ్చింది రూ. 20 కోట్లు
ఖర్చు చేసింది రూ.70 కోట్లే?
సాధారణ నిధులతో అభివృద్ధి
మిగిలిన రూ.280 కోట్లేవి
వైసీపీ నాయకుల డబ్బా
రాజమహేంద్రవరం సిటీ,ఫిబ్రవరి 14 : గతంలో ఎన్నడు లేనివిధంగా అభివృద్ధి చేశాం.. కావాంటే చూసుకోండి అంటూ గొప్పలు చెప్పుకుంటున్న అధి కార పార్టీ నాయకుల అంచనాలు కొండలు దాటితే వాస్తవికతకు చాలా భిన్నంగా ఉందనే లెక్కలు చెబుతున్నాయి.రాజమహేంద్రవరం అభివృద్ధికి చా లా కష్టపడ్డామని వైసీపీ నాయకులు చెబుతున్నా అలా ఎందుకు అంటున్నారో జనానికి అర్ధం కావ డంలేదు. ఎందుకంటే అసలుది వదిలేసి.. కొసరుది పట్టుకుని అభివృద్ధి చేశాం..అభివృద్ధి చేశాం అంటే ఎవరు మాత్రం హర్షిస్తారు.. ప్రస్తుతం రాజమహే ంద్రవరంలో వైసీపీ నాయకులు చేస్తున్నది అదే.. చేసింది కొంతే.. చెప్పేది మాత్రం కొండంత..
సమస్యలివీ..
చారిత్రక రాజమహేంద్రవరాన్ని పట్టిపీడిస్తున్న డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, గోదావరి కాలు ష్యం తదితర సమస్యలకు శాశ్వతం పరిష్కారం లభించలేదనే చెప్పవచ్చు. అందుకు జరిగిన ప్రయత్నాలు అన్ని మధ్యలోనే ఆగిపోయాయి. ఇక రాజమహేంద్రవరం అభివృద్ధి అంటే కంబాల చెరువు పార్కు బ్యూటిఫికేషన్,లైటింగ్, సాయంత్రం వేళలో సేదతీరేవిధంగా వాతావరణం సృష్టించడం కాదు. నగరం లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను పరిష్కరించడం. అంతే కాకుండా నగరాన్ని పీడి స్తున్న అతిపెద్ద సమస్య డంపింగ్ యార్డ్.. రోజు వారి వచ్చే చెత్తను ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి.దీంతో నగరంలో దోమలు, పందులు విజృంభిస్తున్నాయి. కొన్నిప్రాంతాల్లో లెట్రిన్ అవుట్లెట్లను నేరుగా మేజర్ డ్రైనేజీలకు కలిపివేసిన సమస్యలు పెద్దవనే చెప్పాలి. కానీ అవేమీ పాలకులు పరిగణనలోకి పెద్దగా తీసుకోకపోవడం రాజమహేంద్రవరానికి శాపంగా పరిణమించింది.
హంగుకే రూ.100 కోట్లు ..
రాజమహేంద్రవరం కార్పొరేషన్ పరిఽధిలో గడచిన నాలుగున్నరేళ్లలో సుమారు రూ.300 కోట్ల పనులకు అంచనాలు వేశారు. కానీ గొప్పవిషయం ఏమిటంటే కనీసం రూ.100 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. రాజమహేంద్రవరానికి సీఎం జగన్ ప్రత్యేక గ్రాంట్ రూ.125 కోట్లు ఇచ్చారని చెబుతున్న ప్రజాప్రతినిఽధి అసలు ఎంత నిధి వచ్చిందో చెప్పరు.. ఎందుకంటే కేవలం వచ్చింది రూ.20 కోట్లు మాత్రమే. అందులో రూ.18 కోట్లు బిల్లులు అయిపోయాయి. మిగిలింది దైవాదీనం.. నగరంలో ఇప్పటి వరకు జరిగిన పనులు చూస్తే డ్రైనేజీలకు సుమారు రూ.20 కోట్లు, సీసీ రోడ్లకు రూ.15 కోట్లు, కంబాచెరువు ఆధునీకరణకు రూ.13 కోట్లు కేటాయించగా ఇప్పటికి సుమారు రూ.7 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. సుబ్రహ్మణ్మదానంలో ఓపెన్ థియేటర్ ఆడిటోరియం వగైరా పనులకు మంజూరు చేసింది రూ.5 కోట్లు ఇప్పటి వరకూ ఖర్చుచేసింది రూ.2 కోట్లు మిగిలిన పనులు చేయాల్సి ఉంది. మొత్తం నాలుగున్నరేళ్ళలో సుమారు రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య మాత్రమే పనులు జరిగిన ట్టు ప్రాథమిక అంచనా. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిలో 70 శాతం కార్పొరేషన్ సాధారణ నిధు ల నుంచి ఖర్చుచేసినవే.మరి రాష్ట్ర ప్రభుత్వం ప్ర త్యేక గ్రాంటు అంటూ డబ్బాలు కొడుతున్న వారు రేపు ప్రజలకేం సమాధానం చెబుతారో చూడాలి.
మసిపూసి మారేడుకాయ..
ప్రజల జీవనానికి అవసరమైన వాటికి తొలిప్రాధాన్యత ఇచ్చాక అటుపై హంగులు ఆర్బాటాలు వంటివి గత ప్రభుత్వాలు చేసేవి.. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కాస్త భిన్నం.. ఏం చేసినా పైకి కనిపించాలి.. అంతే దాని ఉపయోగం ఎంత అనేది ఆలోచించరు. అందుకే ముందు హంగులు ఆర్బాటలు చేసింది.. నగరంలో దీర్ఘకాలిక సమస్యలుగా ఉన్న మురుగునీటి పారుదల సమస్య, నల్లచానల్ గుండా నేరుగా గోదావరిలో కలుస్తున్న మురుగు, , పేపరుమిల్లు కాలుష్యం, గోదావరి కలుషితం, క్వారీ ప్రాంతంలో గోతుల్లో పడి అనేక మంది మృత్వువాత పడుతున్న సమస్య, పందులు, దోమలు, డెడికేటేడ్ చానల్ నిర్మాణం, నగరంలో పారిశుధ్యకార్మికుల కొరత, 24 గంటల సురక్షిత మంచి నీటి సమస్య, శీలం నూకరాజు కాంప్లెక్స్ రోడ్డు, టీటీడీ కల్యాణ మండపం రోడ్డు, జాంపేట ఉమారామ లింగేశ్వర కల్యాణ మండపం రోడ్డు, మెయిన్ రైల్వే స్టేషన్ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇలా అనేక సమస్యలతో రాజమహేంద్రవరం సతమతమౌతోంది. తనను బాగుచేసే ప్రభుత్వం, ప్రజాప్రతినిధి కోసం ఎదురుచూస్తుందనే చెప్పవచ్చు. వైసీపీ నాయకులకు ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల పుణ్యకాలం కాస్త అయిపోయింది. ఇప్పుడు కొన్ని చోట్ల రాత్రికి రాత్రే మసిబూసి మారేడు కాయ చేసే పనులు పాలకులు చేయడం విడ్డూరంగా ఉంది.