పరిమితికి మించి..
ABN , Publish Date - Apr 25 , 2024 | 01:15 AM
ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా క్వారీ బండరాళ్ళను లారీలపై తరలిస్తున్నారు. దేవరపల్లి మండలంలోని గౌరీపట్నం, దుద్దుకూరు, లక్ష్మీపురం, పంగిడి, చాగళ్లు పరిధిలో ఉన్న క్వారీల నుంచి బండరాళ్లను క్రషర్లకు తరలిస్తుంటారు.
నిబంధనలు తుంగలోకి తొక్కి రవాణా
ఎప్పుడు జారి పడతాయోనని స్థానికుల్లో అందోళన
దేవరపల్లి, ఏప్రిల్ 24: ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా క్వారీ బండరాళ్ళను లారీలపై తరలిస్తున్నారు. దేవరపల్లి మండలంలోని గౌరీపట్నం, దుద్దుకూరు, లక్ష్మీపురం, పంగిడి, చాగళ్లు పరిధిలో ఉన్న క్వారీల నుంచి బండరాళ్లను క్రషర్లకు తరలిస్తుంటారు. పరిమితికి మించి ఈ బండరాళ్లు లోడు వేసి జారిపడే విధంగా వెళ్తుండడంతో పాదచారులు, వాహనచోదకులు, భయభ్రాంతులకు గురవుతున్నారు. క్వారీ బండరాళ్లు తరలించే లారీలు రేయింబవళ్లు తిరుగుతుంటాయి. నిత్యం వేలాది వాహనాలు వెళ్తుండడంతో ఈ రాళ్లు ఎక్కడ మీదపడతాయోనని ప్రజలు బెంబెలెత్తుతున్నారు. గౌరీప ట్నంలో నిర్మలగిరి మేరీమాత ఆలయం ఉండడం, రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ పాఠశాల, కాలేజీ ఉన్నాయి. ప్రతి రోజు వందల సంఖ్యలో భక్తులు మేరీమాత ఆలయానికి వస్తుంటారు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో అధికలోడుతో బండరాళ్లు వెళ్తుండడంతో ఎక్కడ జారి మీదపడతాయోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో రాళ్లు పడి పలువురు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ రాళ్లు లారీల నుంచి కిందపడినప్పుడు వాహనచోదకులు గమనించక ముందుకు వెళ్తుండడంతో ప్ర మాదాలు జరుగుతున్నాయి. పోలీసు అధికారులు క్వారీ, లారీ యజమానులకు సమావేశాలు నిర్వహించి పరిమితికి మించి లోడు వేసి రవాణా చేయొద్దని చెప్పినప్పటికీ, వాహనాలు ఆపి కేసులు నమోదు చేసినప్పటికీ కొద్దిరోజులు మానేసి మరలా యథేచ్ఛగా అధిక లోడులతో లారీల్లో రాళ్లు తరలిస్తున్నారు. గౌరీపట్నంలో చెక్పోస్టు ఏర్పాటు చేసి అధిక లోడు లారీలను నియంత్రించి ప్రజల ప్రాణాలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.