హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ
ABN , Publish Date - Mar 03 , 2024 | 12:15 AM
రాష్ట్రంలో అధికార వైసీపీ హత్యారాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని టీడీపీ సీనియర్ నేత రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు.
రూరల్లో మంత్రి అరాచకాలకు అంతంలేదు
రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఫైర్
రాజమహేంద్రవరం రూరల్, మార్చి 2: రాష్ట్రంలో అధికార వైసీపీ హత్యారాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని టీడీపీ సీనియర్ నేత రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వాధికారులను భయబ్రాంతులకు గురిచేస్తూ తప్పుడు విధానాల్లో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును ప్రచార ఆర్బాటానికి ఫ్లెక్సీలకు ఉపయోగిస్తున్నారని, వలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ దొంగ ఓట్లను చేర్చాలని అధికారులు ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం రూరల్లో మంత్రి గారి అరాచకాలకు అంతంలేకుండా పోయిందన్నారు. పంచాయతీ నిధులను ఫ్లెక్సీ ప్రచారాలకు వినియోగిస్తున్నారని మండిపడ్డారు. అంగన్వాడీలు, ఆశ వర్కర్లకు బహుమతులు ఇస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ ఆస్తులను కొంత మంది ప్రైవేట్ వ్యక్తులకు కేటాయిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ఇసుక మాఫియా జగన్ రెడ్డి నడిపిస్తున్నాడని చెప్పారు. రోజుకు ఇసుకపై రూ.2 కోట్లు పైగా సొమ్ము దోచుకుంటున్నారని ఎన్జీటీ ఆదేశాలను కూడా ఇసుక మాఫియా లెక్కచేయడం లేదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని జగన్రెడ్డి ముఠా నే హతమార్చిందన్నారు. సీబీఐ విచారణ పిటిషన్ వేస్తానని సునీ తమ్మ అంటే జగన్ ఎందుకు ఆపారని ,తొలుత విచారణకోరి అటుపై ఎందుకు ఆపారో జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సీఎంగా ఉండే అర్హత జగన్కు లేదన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కడియం ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.