ఇంకెన్ని ప్రాణాలు పోవాలి!
ABN , Publish Date - May 20 , 2024 | 11:38 PM
వంద కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న సీతానగరం -రాజమహేంద్రవరం 4 లైన్ల రోడ్డులో జరుగుతున్న ప్రమాదాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనులు నత్తనడక సాగుతున్నాయి.
![ఇంకెన్ని ప్రాణాలు పోవాలి!](https://media.andhrajyothy.com/media/2024/20240511/20snm3_0b781ec142.jpg)
అసంపూర్తిగా నిలిచిన కల్వర్టుల పనులు
ఇప్పటి వరకు ఆరు ప్రమాదాలు.. ముగ్గురి మృతి
సీతానగరం, మే 20: వంద కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న సీతానగరం -రాజమహేంద్రవరం 4 లైన్ల రోడ్డులో జరుగుతున్న ప్రమాదాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనులు నత్తనడక సాగుతున్నాయి. ఇప్పటికే ఈ రోడ్డులో ఆరు ప్రమాదాలు జరిగి ముగ్గురు మృతిచెందారు. మండలంలోని రాపాక తూరలు వద్ద, రఘుదేవపురం వద్ద రెండు కల్వర్టులు ఈ రోడ్డులోనే నిర్మిస్తున్నారు. ఈ రెండూ అసంపూర్తిగా ఉండడంతో ఏ విధమైన హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చే వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. అయినా కాంట్రాక్టర్లు గాని, అధికారులు గాని పట్టించుకోవడం లేదు. 4 లైన్ల రోడ్డు కావడంతో రోడ్డు మధ్యలో వేసే డివైడర్ కొన్నిచోట్ల వేయకపోవడంతో మధ్యలో ఉన్న గాడి ప్రమాదాలకు కారణమవుతోంది. ఏ మాత్రం ఆదమర్చినా ప్రమాదం జరుగుతోంది. దీంతో ఈ రోడ్డు పనులు పూర్తయ్యే సరికి ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.