జగన్ను దళితులే ఓడిస్తారు
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:40 AM
అధికారాన్ని ఇచ్చిన దళితులే ముఖ్యమంత్రి జగన్ను రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి గద్దె దించబోతున్నారని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. రాజమహేంద్రవరం రాజీవ్గాంధీ విద్యాసంస్థల్లో గురువారం విలేకరులతో మాట్లాడారు.
![జగన్ను దళితులే ఓడిస్తారు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 11: అధికారాన్ని ఇచ్చిన దళితులే ముఖ్యమంత్రి జగన్ను రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి గద్దె దించబోతున్నారని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. రాజమహేంద్రవరం రాజీవ్గాంధీ విద్యాసంస్థల్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక దళితుల జీవితాలు బాగుపడతాయని ఆశించిన వారి ఆశలపై నీళ్లు చల్లాడన్నారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు వంటివి అధిక మయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత యువకులను కొట్టిచంపితే రూ.10 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోవడం, అత్యాచారం చేసి చంపితే నిందితులను అరెస్టులు చేయకుండా అడ్డుపడడం, ఇద్దరు దళిత యువకులకు శిరోముండనం చేస్తే చర్యలు తీసుకోకపోవడం, డాక్టర్ సుధాకర్ను దారుణంగా ఇబ్బందులకు గురిచేసి అతను చనిపోవడానికి కారణం కావడం ఇలా అనేక సంఘటనలు ఉన్నాయన్నారు. అందుకే దళితులంతా ఏ ఓటుతో జగన్ను సీఎం చేశారో అదే ఓటు తో కిందకు దించబోతున్నారని చెప్పారు. వచ్చే నెల 8న రాజమహేంద్రవరం బొమ్మూరులో దళిత సింహగర్జన నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభ ద్వారా దళితుల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. అమలాపురం నుంచి తాను ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. సమావేశంలో జీవీ శ్రీరాజ్, యర్రా రామకృష్ణ పాల్గొన్నారు.