‘గిరి’ చెరిగేనా?
ABN , Publish Date - Jul 28 , 2024 | 01:10 AM
వైసీపీ ప్రభుత్వం 2022లో జిల్లాల విభజన ప్రక్రియ చేపట్టింది. ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లాను నాలుగు జిల్లాలుగా విడదీసింది. దీంతో రంపచోడవరం ఐటీడీఏ ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి విడిపోయి కొత్తగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిసింది.

జిల్లాలో సబ్ప్లాన్ ఏజెన్సీ మండలాల గిరిజనుల కష్టాలు ఇకనైనా తీరేనా
కొత్త ప్రభుత్వం రావడంతో తమకు గుర్తింపు లభిస్తుందని ఎదురుచూపులు
గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాలో గిరిజనుల కష్టాలకు లభించని మోక్షం
ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు ప్రతిపాదనలు అందినా చెత్తబుట్టలో పడేసిన వైనం
అప్పటి ప్రభుత్వంపై కనీస ఒత్తిడి కూడా చేయని నాటి మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు
జిల్లాల విభజనతో అల్లూరి జిల్లాకే పరిమితమైపోయిన రంపచోడవరం ఐటీడీఏ
అప్పటి నుంచి జిల్లా సబ్ప్లాన్ ఏజెన్సీలోని 28 వేల మంది గిరిజనులకు ఐటీడీఏ నిల్
మైదాన ప్రాంతం పరిధిలోకి వచ్చేయడంతో షెడ్యూల్ ఏరియా గుర్తింపు మాయం
తమ గుర్తింపు కోసం ఆదివాసీలు పోరాటాలు చేసినా పట్టించుకోని జగన్ ప్రభుత్వం
ఇప్పుడు కొత్త సర్కారు రావడంతో న్యాయం చేయాలని కోరుతున్న ఆదివాసీలు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
వైసీపీ ప్రభుత్వం 2022లో జిల్లాల విభజన ప్రక్రియ చేపట్టింది. ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లాను నాలుగు జిల్లాలుగా విడదీసింది. దీంతో రంపచోడవరం ఐటీడీఏ ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి విడిపోయి కొత్తగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిసింది. ఫలితంగా కాకినాడ జిల్లాలోని తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిధిలోని 59 సబ్ప్లాన్ ఏజెన్సీ గ్రామాల సరిహద్దు మారిపోయింది. అప్పటివరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐటీడీఏ పరిధిలో ఉన్న ఈ గ్రామాలు ఆ తర్వాత కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చాయి. రం పచోడవరం ఐటీడీఏ అల్లూరి జిల్లాలోకి వెళ్లిపోవడంతో కాకినాడ జిల్లాకు ఐటీడీఏ లేకుండా పోయింది. దీంతో ఎన్నో ఏళ్లుగా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజనులు జిల్లాల విభజనతో ఐటీడీఏ కోల్పోయారు. ఐటీఏడీ వేరే జిల్లాలోకి వెళ్లిపోవడంతో, అందులోని సబ్ ప్లాన్ ఏజెన్సీ మండలాలు కాకినాడ జిల్లాలో ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని నియోజకవర్గాల పరిధిలోని పది మండలాల పరిధిలో గల 59 గ్రామాల్లో 28 వేల మంది గిరిజనులు ఐటీడీఏ కోల్పోయారు. జిల్లా మారిపోవడంతో ఈ గిరిజనులతో ఇకపై తమకు సంబంధం లేదని రంపచోడవరం ఐటీడీఏ 2022 ఏడాది చివర్లో చేతులు దులిపేసుకుంది. 59 సబ్ప్లాన్ గ్రామాల్లో మౌలికసదుపాయాలు, సమస్య లు, గిరిజనుల ఉద్యోగాల రిజర్వేషన్ ఏదీ తమకు సంబంధం లేదని అప్పట్లో అధికారులు తేల్చేశారు. ఫలితంగా ఏ సమస్య వచ్చినా తమను అప్పటి నుంచి ఎవరూ పట్టించుకోకపో వడంతో జిల్లా పరిధిలోని గిరిజనులు ఆందోళనలు చేస్తున్నారు. వాస్తవానికి ఇంతకుము నుపు ఈ గ్రామాలన్నీ ఎన్నో ఏళ్లుగా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని సబ్ప్లాన్ ఏజెన్సీ మండలాలుగా కొనసాగేవి. ఫలితంగా వీరందరి బాగోగులు ఐటీడీఏ చూసేది. విద్య, వైద్యం, రహదారుల సౌకర్యం మొదలు తాగునీటి వసతి, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథ కాల లబ్ధి, ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ వరకు అన్నీ వర్తింపజేసేది. తీరా 2022 నుంచి ఐటీడీఏ పరిధి కోల్పోవడంతో 59 గ్రామాల్లోని గిరిజనులంతా మైదాన ప్రాంత గిరిజను లుగా మారిపోయారు. తద్వారా షెడ్యూల్ తెగల ఏరియా హోదా సహా గిరిజనుల కోటా కింద వచ్చే ప్రయోజనాలన్నీ పోయాయి. ఈనేపథ్యంలో 28వేల మంది గిరిజనులు తమ ను కాకినాడ జిల్లా నుంచి తప్పించి అల్లూరి జిల్లాలో కలపాలని అప్పటినుంచీ డిమాండ్ చేస్తున్నారు. గ్రామసభల్లో తీర్మానాలు చేసి అప్పటి కలెక్టర్కు కూడా పంపించారు. అలాగే 59 గ్రామాల పరిధిలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు సైతం వీరి న్యాయపరమైన డిమాండ్ కోసం ఆందోళకు మద్దతు ఇచ్చారు. షెడ్యూల్ ఏరియాగా గుర్తించాలంటూ జిల్లా పరిషత్లో తీర్మానించారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ఏరియాగా గుర్తించాలా? లేదా? అనే దానిపై రంపచోడవరం ఐటీడీఏ పీవో నుంచి అప్పటి కాకినాడ కలెక్టర్ నివేదిక కోరారు. దీనిపై అధ్యయనం చేసిన ఐటీడీఏ అధికారులు 2023లో నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. 59 గ్రామాల్లో 56 గ్రామాలనే గిరిజన ప్రాంతాలుగా గుర్తించొచ్చని సిఫార్సు చేశారు. వీరంతా గిరిజనులే కాబట్టి ఐటీడీఏ విడిపోవడంతో వీరు నివసిస్తోన్న గ్రామాలను గిరిజన తెగ గ్రామాలుగా ప్రకటించాలని నివేదికలో పేర్కొన్నారు. అయితే వీరికి ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయడమా? లేదా షెడ్యూల్ ఏరియాగా గుర్తించి ఐటీడీఏ లేకుండా పథ కాలు అమలు చేయడమా? అనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నివేదికలో ప్రస్తావించారు. అలాగే జిల్లాలో మండలాల వారీగా ఏయే గ్రామంలో ఎంతమంది ఆదివాసీలు ఉన్నారో జనాభా లెక్క లు కూడా నివేదికలో పొందుపరిచారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఉన్నప్పుడు 56 గ్రామాలకు చేసిన ఖర్చు.. గ్రామాల్లో సామాజికవర్గాల వారీగా జనాభా తదితర విశ్లేషణలు కూడా క్రోడీ కరించారు. జిల్లాలో 56 గ్రామాలను గిరిజన ప్రాంతాలుగా గుర్తిం చడానికి రంపచోడవరం ఐటీడీఏ అభ్యంతరం లేదని నివేదిక పం పిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నుంచి కూడా సిఫార్సులతో కూడిన నివేదిక గతేడాది రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లింది. ఈనివేదిక కూడా గిరిజ నులకు అనుకూలంగానే ఉంది. జిల్లా గిరిజన సంక్షేమశాఖ సైతం ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయాలని నివేదిక పంపింది.
చెత్తబుట్టలో పడేశారంతే..
నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి అందినా అప్పటి జగన్ సర్కారు కనీసం పట్టించుకోలేదు. ప్రత్యేక ఐటీడీఏకు ఆమోదం తెలపడం, లేదా.. సబ్ప్లాన్ ఏజెన్సీ మండలాలను ప్రత్యేక గిరిజన ప్రాంతంగా నోటిఫై చేసి ప్రత్యేక అధికారిని నియమించడం అనేదానిపై ఏదీ తేల్చకుండా చెత్తబుట్టలో పడేసింది. జిల్లా నుంచి అమరావతికి వెళ్లిన నివేదికలను రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ పరిశీల నకు పంపితే వాటన్నింటిని అప్పటి సర్కారు మూలన పడేసింది. అప్పటి జిల్లా మంత్రి దాడిశెట్టి రాజా, సంబంధిత సబ్ప్లాన్ ఏజెన్సీ మండలాల పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంపై కనీసం ఒత్తిడి తేలేదు. దీంతో రాష్ట్రప్రభుత్వం అసలు దీన్ని ఓ సమస్యగా భావించలేదు. అప్పటి మంత్రి, జిల్లా ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని ఈ సమస్యను మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చేలా చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా ప్రయత్నాలు చేస్తే ఫలించే అవ కాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నం కూడా జరగడం లేదు. దీంతో సబ్ప్లాన్ ఏజెన్సీ గ్రామాలకు ఐటీడీఏ ఏర్పాటు కలగానే మిగిలిపో యింది. అయితే ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారం లోకి రావడంతో తమకు న్యాయం చేయాలని గిరిజనులు కోరుతు న్నారు. గత ప్రభుత్వం నిలువునా మోసంచేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు తమ గోడును పట్టించుకోవాలని కోరుతున్నారు. ఈ సమస్యపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ దృష్టిసారించడంతో గిరి జనుల్లో కొంత ఆశ నెలకొంది. సత్యప్రభ ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో ఆశలు చిగురిస్తున్నాయి. అయి తే ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఐటీడీఏ ప్రకటించడమా లేదా దానికి సమాన ప్రతిఫలం కల్పించాలని కోరుతున్నారు.