గామన్ వంతెనకు రెండు వారాల్లో మరమ్మతులు
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:24 AM
రెండు వారాల్లో గామన్ వంతెనకు మరమ్మ తులు చేపడతామని జిల్లా కలెక్టర్ మాధవీలత తెలిపారు.
పూనేలో డిజైనర్కు బేరింగ్లు ఆర్డర్
ఇరువైపులా వాహన రాకపోకలకు అనుమతులు
వంతెన పరిశీలించిన జిల్లా కలెక్టర్ మాధవీలత
కొవ్వూరు, మార్చి 27 : రెండు వారాల్లో గామన్ వంతెనకు మరమ్మ తులు చేపడతామని జిల్లా కలెక్టర్ మాధవీలత తెలిపారు. తూర్పుగో దావరి జిల్లా దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వరకూ ఎక్స్ప్రెస్ హైవేకు అనుసంధానం గోదావరిపై నిర్మించిన గామన్బ్రిడ్జి మరమ్మతులకు గురైన ప్రాంతాన్ని బుధవారం సాయంత్రం పరిశీలించి మాట్లాడారు. వంతెన నిర్వహణ సంస్థ పాత్ వంతెనపై వైబ్రేషన్ ఎక్కువగా వస్తుందని గమనించిందన్నారు.పాత్ సంస్థ, ఇండిపెండెంట్ ఇంజనీర్స్, ప్రభు త్వం తరపు ఇంజనీర్లు 57, 58 పిల్లర్ల వద్ద బేరింగ్లు దెబ్బతినడం వల్ల వైబ్రేషన్స్ వచ్చాయని గుర్తించారన్నారు. దీనికి సంబంధించిన బేరింగ్లు అందుబాటులో ఉండవు. పూనేలో బేరింగ్ డిజైనర్ను గుర్తించి బేరింగ్కు ఆర్డర్ ఇచ్చారన్నారు. బేరింగ్ తయారుచేయడానికి 10 రోజులు, బేరింగ్ బ్రిడ్జికి అమర్చడానికి మరో 5 రోజులు పడుతుందన్నారు. డిజైనర్ దగ్గరకు ఇంజనీర్ను పంపించామని చెప్పారు. అనుకున్న సమయాని కంటే ముందుగా బేరింగ్ అమర్చడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా తక్కువ సమయంలో మరమ్మతులు చేపట్టడానికి ఏమైనా అవకా శం ఉన్నదా పరిశీలిస్తున్నామన్నారు. వంతెనపై రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వచ్చే మార్గంలో రెండు వైపులా వాహన రాకపోకలకు అనుమతించడం జరిగిందన్నారు.ఈ మేరకు ఇంజనీర్లు నుంచి రెండు వైపులా వాహనాలు అనుమతించడానికి గల సర్టిఫికెట్ను పొందడం జరిగిందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు, ఆర్టీవో, గామన్ వంతెన నిర్వాహక సంస్థ పాత్ సంస్థ సిబ్బంది నిత్యం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఇంజనీర్స్ మాట్లాడుతూ బ్రిడ్జి ప్రారంభించి పదేళ్లు దగ్గరగా వస్తుండడంతో బేరింగ్స్ దెబ్బతింటాయన్నారు. బేరింగులపై అధికంగా బరువు పడడం, పిల్లర్, స్లాబ్ కంప్రెషర్ అవ్వడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.