రైతుల ప్రయోజనాలు నీటిసంఘాల బాధ్యత
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:28 AM
గత పాలకుల హయాంలో రాజోలు నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు.

మలికిపురం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): గత పాలకుల హయాంలో రాజోలు నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. సోమవారం మలికిపురం ఎల్ఎస్ ల్యాండ్ మార్కు వద్ద జరిగిన సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు కమిటీ సమావేశంలో మాట్లాడుతూ 14వేల ఎకరాల ఆయకట్టు ఉంటే కేవలం 3400ఎకరాల ఆయకట్టుకు వ్యవసాయం దిగజారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల నాయకులు బాధ్యతాయుతంగా పనిచేసి రైతులకు మేలు చేయాలని పిలుపునిచ్చారు. రాజోలు నియోజకవర్గంలో డ్రెయిన్లు, కాల్వల ఆధునికీకరణకు రూ.373కోట్ల వ్యయ అంచనాలతో సీఎం చంద్రబాబుకు నివేదికలు అందజేశానన్నారు. మన ప్రాంతానికి 2కోట్ల లీటర్ల నీరు అవసరం ఉంటే 60శాతం మాత్రమే వస్తుందన్నారు. సెంట్రల్ డెల్టా చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి అధికారులు, ఎమ్మెల్యే సహకారంతో ముందుకు వెళతామన్నారు. ఇరిగేషన్ ఈఈ నరసింహారావు, డీఈ నాగేంద్రకుమార్, హెడ్వర్క్స్ డీఈ శ్రీనివాస్, డ్రైనేజీ డీఈ నాగార్జున, డీసీ పినిశెట్టి బుజ్జి, మార్క్ఫెడ్ డైరెక్టర్ గుండుబోగుల పెద్దకాపు, చాగంటి స్వామి, నియోజకవర్గంలోని నీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.