కచ్చితంగా పోటీలో ఉంటా
ABN , Publish Date - Mar 16 , 2024 | 12:20 AM
‘ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను, పార్టీకి రాజీనామా చేయను, కొవ్వూరులో పార్టీ జెండాలతోనే ప్రచారానికి వెళ్తాను. అధిష్టానం తిరిగి పునరాలోచనా చేయాలి’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్ పేర్కొన్నారు.
![కచ్చితంగా పోటీలో ఉంటా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చంద్రబాబు, లోకేశ్ల ఫొటోలతో ముందుకెళ్తా
ఈ పోటీ అచ్చిబాబుతోనే చంద్రబాబుతో కాదు
టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్
కొవ్వూరు, మార్చి 15: ‘ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను, పార్టీకి రాజీనామా చేయను, కొవ్వూరులో పార్టీ జెండాలతోనే ప్రచారానికి వెళ్తాను. అధిష్టానం తిరిగి పునరాలోచనా చేయాలి’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్ పేర్కొన్నారు. కొవ్వూరులోని తన నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి తనను వ్యతిరేకించిన వ్యక్తులు పార్టీ కోసం ఏనాడు పనిచేయలేదని, చంద్రబాబు జైలులో ఉండగా కనీసం పలకరించలేదని, ధర్నాలు చేయలేదన్నారు. తనపై 14 కేసులు ఉన్నాయని, అచ్చిబాబుపై ఒక్కటీ లేదన్నారు. చంద్రబాబు, లోకేశ్ ఫొటోలతోనే ముందుకు వెళ్తానన్నారు. ఈ పోరాటం అచ్చిబాబుకి తనకు తప్ప, చంద్రబాబుతో కాదన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో 11 మంది ఆశావహులను పెట్టుకున్నారని, ఒక్కొక్కరితో కోట్లాది రూపాయలు ఖర్చు చేయించారని, వారిలో ఒక్కరు కూడా నచ్చలేదా అని ప్రశ్నించారు. అక్కడి చెత్త ఇక్కడ బంగారం అవుతుందా అని బహిరంగ సభల్లో విమర్శించిన వారికి అక్కడ చెత్త ఇక్కడ బంగారం ఎలా అయ్యిందో తమకు తెలియదని, ఆ బంగారాన్ని ఎలా గెలిపిస్తారో చెప్పాలన్నారు. నిర్ణయం తీసుకునేముందు తనను సంప్రదించక పోవడం ఏకపక్షంగా ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యక్తులుగా ప్రజల మనస్సుల్లో ఏముందో అదే ఆచరిస్తామన్నారు. కచ్చితంగా పోటీలో ఉంటాన న్నారు. కార్యక్రమంలో ముప్పిడి రాజు, రాపాక శ్రీనివాస్, బూరుగుపల్లి వీరరాఘవులు, వేగి చిన్నా, కోడూరి ప్రసాద్, చావా శ్రీనివాస్, తిగిరిపల్లి గోపి పాల్గొన్నారు.