ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ ఫారం 7,8 స్వీకరణ
ABN , Publish Date - Mar 14 , 2024 | 12:57 AM
త్వరలో సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలవుతుందని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత తెలిపారు.
![ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ ఫారం 7,8 స్వీకరణ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
జనవరి 23 నుంచి 11,331 ఓట్లు తొలగింపు
జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 13: త్వరలో సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలవుతుందని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత తెలిపారు. ఈ మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లు దాఖలు, అఫిడవిట్లు సమర్పించే విషయంలో ఎన్నికల కమిషన్ నియమావళి సమయపాలన ఖశ్చితంగా పాటించాలన్నారు. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, జవాబుదారీ తనం తో నిర్వహించడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజల ద్వారా వచ్చే ఫిర్యాదులు వివిధ మాధ్యమాల్లో వచ్చే ప్రతికూల వార్తలు విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు తీసుకున్న చర్యల గురించి ఎప్పటికప్పుడు వివరణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే తేదీ వరకు ఫారం 7,8 స్వీకరిస్తామన్నారు. 18 ఏళ్ళు నుంచి 21 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న వారి నుంచి ఫారం 6 ధరఖాస్తులు తీసుకుంటామన్నారు. తుది ఓటరు జాబితా నుంచి మరణించిన వారి ఓట్ల తొలగింపు విధానంలో ప్రధాన ఎన్నికల అధికారి ఆమోదం పొందడం జరుగుతుందన్నారు. జనవరి 23 నుంచి ఈ రోజు వరకు 11,331 ఓట్లను తొలగించామని చెప్పారు. చిరునామా మార్పుకు సంబంధించి 4,392 ఓట్లు , మరణించిన ఓట్లు 4225 , డూప్లికేట్ ఓట్లు 2701 ఓట్లు ఉన్నాయన్నారు. ఓటు హక్కుకలిగి ఉండి ఎపిక్ కార్డ్ లేకపోయినా ఏదో ఒక గుర్తింపుకార్డుతో ఓటు వేయవచ్చన్నారు. సమావేశంలో డీఆర్వో జి.నరసింహులు, కేఆర్ఆర్సీఎస్డీడీ ఆర్.కృష్ణనాయక్, రాజకీయ పార్టీల ప్రతినిధులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కాంగ్రెస్ నాయకులు నలబాటి రమేష్, బీజేపీ పివి లక్ష్మి, సీపీఎం ఎస్ఎస్.మూర్తి, టీడీపీ సిహెచ్ శ్రీనివాసరావు, వైసీపీ వైవీఎస్ శ్యామల , ఎలక్షన్ డీటీ ఎమ్.సునీల్ కుమార్ ,గిరీష్ ,తులసి పాల్గొన్నారు.