Share News

పదికి కొత్త సిలబస్‌

ABN , Publish Date - May 21 , 2024 | 01:04 AM

సామర్లకోట/కిర్లంపూడి, మే 20: నూతన విద్యావిధానాన్ని అమలుచేస్తున్న ప్రభుత్వం రానున్న విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా నూతన పాఠ్యాంశాలతో కూడిన పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు చేరుకుంటున్నాయి. గత ఏడాది తొమ్మిదో తరగ

పదికి కొత్త సిలబస్‌

సీబీఎస్‌ఈకి అనుబంధంగా పాఠ్యాంశాల రూపకల్పన..

ఏడు పుస్తకాల స్థానంలో 11 పాఠ్య పుస్తకాలు

సామర్లకోట/కిర్లంపూడి, మే 20: నూతన విద్యావిధానాన్ని అమలుచేస్తున్న ప్రభుత్వం రానున్న విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా నూతన పాఠ్యాంశాలతో కూడిన పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు చేరుకుంటున్నాయి. గత ఏడాది తొమ్మిదో తరగతిలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేయడంతో దానిని కొనసాగింపుగా ఈ ఏడాది పదో తరగతి సిలబస్‌ మొత్తాన్ని మార్చివేసింది. పాత సిలబస్‌కు భిన్నంగా ఉంటాయని విద్యా శాఖాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం గత ఏడాది తొమ్మిదో తరగతి నుంచి ప్రయోగాత్మకంగా కొత్త పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ విద్యార్దులంతా ఈ ఏడాది పదో తరగతిలోకి వస్తుండడంతో సిలబస్‌ కొనసాగింపుగా సీబీఎస్‌ఈని పోలేవిధంగా పాఠ్యాం శాలు రూపొందించారని అధికారులు చెబుతున్నారు. పాతసిలబస్‌లో తెలుగు, గణితం, ఆంగ్లం, సైన్స్‌, సోషల్‌, హిందీ టెక్స్ట్‌ బుక్స్‌ ఉండేవి. కొత్త సిలబస్‌లో 11 రకాల టెక్స్ట్‌ బుక్స్‌ ఉన్నాయి. తెలుగు వాచకం, ఉపవాచకం, జీవశాస్త్రం, జియోగ్రఫీ, సోషల్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌, డెమొక్రటిక్‌ పాలిటిక్స్‌, గణితం, హిందీ వాచకం, ఉపవాచకం, ఇంగ్లీష్‌ వాచకం, ఉపవాచకంతో పాటు వర్క్‌ పుస్తకాలు ఉన్నాయి. సాదారణంగా పాఠశాలలో ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తుంటే విద్యార్ధి శ్రద్ధగా విని ఆకళింపు చేసుకుని ఆ తరువాత వాటిని క్షుణ్ణంగా చదువుతుంటారు. అయితే కొత్త సిలబస్‌లో విద్యార్థులు స్వయంగా ప్రయోగం చేసి తనలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేలా తీర్చిదిద్దారని కాకినాడ జిల్లా విద్యాశాఖ సీఎంవో చామంతి నాగేశ్వరరావు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత చదువులకు ఈ సిలబస్‌ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.

Updated Date - May 21 , 2024 | 01:04 AM