Share News

గోదావరి తీరాన.. ఎన్‌టీఆర్‌ కుమార్తె..

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:21 AM

రాజీలేని రాజకీయ చాతుర్యం.. వాగ్దాటిలోని గాంభీర్యం.. వ్యవహారంలో చాణక్యం.. అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం.. అన్నింటికీ మించి తెలుగువారి కీర్తిని దశ దిశలా చాటిన మహానుభావుడు ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి.. ‘తూర్పు’ ఆడబడుచుగా సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్‌ బరిలో బీజేపీ తరపున అడుగుపెట్టారు.

 గోదావరి తీరాన.. ఎన్‌టీఆర్‌ కుమార్తె..

పార్లమెంట్‌ అభ్యర్థిగా పురందేశ్వరి

బీజేపీ నుంచి అవకాశం

చిన్నమ్మకు అభిమానుల స్వాగతం

కలిసిరానున్న మూడు పార్టీల కూటమి

బీజేపీకి కలిసొచ్చే అంశం

ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా అనుభవం

జిల్లాతో ఇద్దరు కుమార్తెలకు అనుబంధం

నేడు రాజమహేంద్రవరం రాక

ఎన్నికలకు దిశా నిర్దేశం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

రాజీలేని రాజకీయ చాతుర్యం.. వాగ్దాటిలోని గాంభీర్యం.. వ్యవహారంలో చాణక్యం.. అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం.. అన్నింటికీ మించి తెలుగువారి కీర్తిని దశ దిశలా చాటిన మహానుభావుడు ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి.. ‘తూర్పు’ ఆడబడుచుగా సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్‌ బరిలో బీజేపీ తరపున అడుగుపెట్టారు. గోదావరి తీరంతో ఎన్టీఆర్‌కి ఉన్న అనుబంధం.. తూర్పుగోదావరి జిల్లాలో కమలానికి ఉన్న ఆదరణ కలగలిపి ఆమె విజయం నల్లేరుపై నడ కేననే ధీమా వ్యక్తమవుతోంది.ఆ కుటుంబాన్ని వర్గవర్ణాలకు అతీతంగా అభిమానించే వాళ్లకు కొదువ లేకపోవడం.. మూడు పార్టీల పొత్తుతో వచ్చిన జోరు ఆ ధీమాకు కారణం కావచ్చు. దీంతో కులమతాలకతీతంగా గోదావరి తీరం ఎన్టీఆర్‌ కూతురికి స్వాగతం పలుకుతోంది.

బలం.. బలగం..

జిల్లాలోని బీజేపీలో ఇంటిపోరు లుకలుకలు తక్కువేమీ కాదు. గతంలో రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేసిన ఓ నేత అం దరినీ దూరం పెట్టి తానే రాజు, తానే మంత్రి అనే చందంగా వ్యవహరించడంతో జిల్లాలోని బీజేపీలో ఏదో తెలియని నైరాశ్యం అలముకుందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో జిల్లాలోని పార్టీలో వర్గపోరు నెలకొంది. ఇప్పటికీ రెండు మూడు వర్గాలుగా చీలిపోయి ఎవరి తీరు వారిదే అనే చందంగా పార్టీ ఉంది. అందరినీ ఓ దారికి తీసుకు రావడం ఇప్పుడు పురందేశ్వరి ముందున్న పెద్ద చాలెంజ్‌.. ఇదిలా ఉండగా ఎన్టీఆర్‌ కుటుంబానికి అన్ని వర్గాల్లోనూ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండడం ఆమెకు అధిక శాతం కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.

జిల్లాలో బీజేపీకి పట్టు..

తూర్పులో బీజేపీకి బలమైన బీజం ఉందనడంలో సందేహం లేదు. సామాజిక వర్గాల పరంగా కూడా బలం ఉంది. 1998లో గిరజాల వెంకటస్వామినాయుడు, తర్వాత ఎస్‌పీబీకే సత్యనారాయణను ఇక్కడి ప్రజలు పార్లమెంట్‌కి పంపించారు. సత్యనారాయణ కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. 2014లో ఆకుల సత్యనారాయణ రాజమ హేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా కమలం గుర్తుపై గెలు పొందారు.1998లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కృష్ణంరాజు వంటి హేమాహేమీలు వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో బీజేపీలో చేరారు. కాకినాడలో పెద్ద సంఖ్యలో కవాతు నిర్వహించారు. 1984 నుంచి 2019 వరకూ జరి గిన పది లోక్‌సభ ఎన్నికల్లో జిల్లా నుంచి బీజేపీ రెండు సార్లు ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు. ఓసారి రాజమహేంద్రవరం నుంచి కమలం తరపున ఎమ్మెల్యే సారఽథ్యం వహించారు.

తండ్రికి తగ్గ కూతురు..

పురందేశ్వరికి రాజకీయంగా తండ్రికి దగ్గ కూతురు అనే పేరుంది. రాజకీయాల్లోకి వచ్చిన తక్కువ సమయంలో ఎన్నో ప్రాధాన్యం ఉన్న పదవులను ఆమె కైవశం చేసు కున్నారు. ఆమె వాక్చాతుర్యం, శ్రమించే తత్వం చూసి ఆయా పార్టీల పెద్దలు కీలకమైన బాధ్యతలు అప్పగిం చారు. ఏ పార్టీలో ఉన్నా ఆమె తనకంటూ ఓ అస్థిరత సముపార్జించుకున్నారు. 2004లో బాపట్ల నుంచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా గెలుపొందారు. 2009లో విశాఖ పట్నం నుంచి రెండో సారి ఎంపీగా ఎన్నికై మన్మోహన్‌ సింగ్‌ మంత్రివర్గంలో వాణిజ్యం, పరిశ్రమలు, మానవ వనరుల అభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా సేవలందిం చారు. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్‌ తీరును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. తొలి కేబినెట్‌ సమావేశాన్ని బహిష్కరించారు. 2014లో బీజేపీలో చేరారు. అనతికాలంలోనే మహిళా మోర్చా ప్రధాన ప్రభారిగా, బీజేపీ ఒడిశా ఇన్‌చార్జి, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఇండి పెండెంట్‌ డైరెక్టర్‌ తదితర హోదాల్లో పనిచేశారు. 2023 జూలై 4న ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిం చారు. ఏపీ బీజేపీలో రాష్ట్రానికి తొలి మహిళా అధ్యక్షు రాలిగా రికార్డు సాధించారు. పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు జిల్లాలో సన్నిహితులు ఉన్నారు. 1983 నుంచి 94 వరకూ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడి హోదాలో ఒంగోలు కంటే తూర్పుపైనే ఎక్కువగా దృష్టి సారించారు. 1994లో ఆర్ట్స్‌ కళాశాలలో జరిగిన ఎన్టీఆర్‌ భారీ బహిరంగ సభకు ఇన్‌చార్జిగా వ్యవహరించారు.

ఆమె గెలిస్తే

చంద్రబాబు జైల్లో ఉండగా ఆమె గౌరవప్రదమైన పాత్ర పోషించారు. అటు కుటుంబ సభ్యురాలిగా బాధ్యత నిర్వ ర్తిస్తూనే ఇటు పార్టీ గీత దాటలేదు. చంద్రబాబును అక్రమంగా జైలులో పెట్టినప్పుడు లోకేశ్‌కి ఢిల్లీలో పురం దేశ్వరి బాసటగా నిలిచారు. ఇప్పటికే ఆమెకు కేంద్ర ప్రభుత్వంలో పలుకుబడి ఉంది. పలు కీలకమైన బాధ్య తలు నిర్వర్తించడంతో అత్యున్నత స్థాయి అధికారుల కార్యాలయాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. రాజమ హేంద్రవరం ఎంపీగా ఆమె గెలిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధికి నిధులు సునాయాసంగా తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ ఐదేళ్లలో పారిశ్రామికంగా, పర్యాట కంగా జిల్లా వెనకడుగు వేసిందనడంలో సందేహం లేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు అంతంత మాత్రమే. పెద్ద ప్రాజెక్టులు కూడా ఏమీ మంజూరు కాలేదు. చివరికి జిల్లా కేంద్రంలో ఉన్న హేవలాక్‌ బ్రిడ్జి(పాత రైలు వంతెన)ని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయలేక లైట్లు పెట్టి మభ్యపెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పురందేశ్వరి ఇక్కడి నుంచి ఎంపీ అయితే రానున్న ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకురావడం ద్వారా అభి వృద్ధిని పరుగులు పెట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఆమె గతంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సహాయ మంత్రిగా పని చేయడంతో యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.

గోదారోళ్లతో అనుబంధం

ఎన్‌టీఆర్‌ కుటుంబానికి గోదావరి జిల్లాలతో ప్రత్యేక అనుబంధం ఉంది. నేటికీ ఎన్‌టీఆర్‌కు ఎంతో మంది అభి మానులు ఉన్నారు. టీడీపీతో కలిసి పయనిస్తు న్నారు. చంద్రబాబు కుటుంబానికి జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమ యంలో ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 53 రోజులు ఉన్నారు. ఆ రోజు రాత్రి ఆయనతో వచ్చిన లోకేశ్‌ చంద్రబాబు జైలులోకి అర్ధరాత్రి 1.20 గంటల సమయంలో వెళ్లాక బాధాతప్త మనసుతో జైలుకు కొద్ది దూరంలో ఉన్న తాత్కాలిక నివాసానికి వెళ్లారు. మరుసటి రోజున ఎన్టీఆర్‌ కుమార్తె,చంద్రబాబు సతీమణి భువనే శ్వరి రాజమహేంద్రవరం చేరుకున్నారు. అప్పటి నుంచీ లోకేశ్‌ కోర్టు పనుల నిమిత్తం ఢిల్లీకి వెళ్లినా.. భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ఇక్కడే ఉండి కార్యకర్తలకు ధైర్యంగా నిలిచారు.స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. అలా గోదా వరి తీరంతో ఎన్టీఆర్‌ కుటుంబం అనుబంధం పెన వేసు కోగా..గోదారివాసులు ఆప్యాయంగా చేరదీశారు.గో దావరి వాసులకు మరింత దగ్గరయ్యేందుకు ఇప్పుడు కూ టమి తరపున పురందేశ్వరి పార్లమెంట్‌ బరిలో దిగుతున్నారు.

ఆమెను అభిమానులే గెలిపిస్తారు..

కులమతాలకు అతీతంగా ఎన్టీఆర్‌ కుటుంబానికి జిల్లాలో అభిమానులు న్నారు. బీజేపీలోని అన్ని హోదాల్లోని నాయకులూ కలిసికట్టుగా ఆమెను గెలిపించు కోవడా నికి సన్నద్ధంగా ఉన్నారు. వర్గాలతో ఆమెకు సంబంధం లేదు. అన్ని వర్గాల్లోనూ ఆమెను చేరదీసేవారు ఉన్నారు. అందువల్ల పురందేశ్వరిని రాజమండ్రి నుంచి పార్లమెంట్‌కి కచ్చితంగా పంపిస్తాం.

- నీరుకొండ వీరన్న చౌదరి, బీజేపీ సీనియర్‌ నేత

నేడు రాజమహేంద్రికి పురందేశ్వరి

ఎన్నికల కమిటీ సభ్యులతో సమావేశం

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 27 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఆ పార్టీ రాజమండ్రి పార్లమెంట్‌ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి గురువారం రాజమహేంద్రవరం రానున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మఽధ్యాహ్నం పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల కమిటీ సభ్యులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి పార్టీ ఇన్‌ఛార్జి సిద్ధార్థసింగ్‌, సోము వీర్రాజు, ఇతర ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో గెలుపు దిశగా పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, అంతర్గత సమస్యలు గురించి చర్చించే అవకాశం ఉంది.బీజేపీ తరపున రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఖరారైన తర్వాత పురందేశ్వరి తొలిసారిగా రాజమహేంద్రవరం రానుండడంతో పార్టీ శ్రేణుల్లో ఎన్నికల ఉత్సాహం కనిపిస్తోంది.ఉదయం నరసాపురం పార్లమెంట్‌ స్థాయిలో జరిగే సమావేశంలో పాల్గొన్న తర్వాత రాజమహేంద్రవరంలో పాల్గొని, ఇక్కడి నుంచి అనకాపల్లిలో సమావేశానికి పురందేశ్వరి వెళ్లనున్నట్టు సమాచారం.

Updated Date - Mar 28 , 2024 | 12:21 AM