Share News

బీచ వాలీబాల్‌ పోటీలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:44 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాంలో ఈ నెల 27 నుంచి 29 వరకు డే అండ్‌ నైట్‌ నేషనల్‌ ఇన్విటేషన మహిళా బీచ్‌ వాలీబాల్‌ పోటీలకు క్రీడా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఎస్‌.యానాంలో టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే ప్రయత్నంలో భాగంగా బీచ్‌ వాలీబాల్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు వాలీబాల్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు చెప్పారు.

బీచ వాలీబాల్‌ పోటీలకు సర్వం సిద్ధం

ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాంలో నేటి నుంచి మహిళా నేషనల్‌ ఇన్విటేషన బీచ్‌ వాలీబాల్‌ టోర్నమెంటు

నిబంధనల మేరకు ఫ్లడ్‌ లైట్ల వెలుగులో డే అండ్‌ నైట్‌ మ్యాచలు... ప్రారంభోత్సవానికి హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు

ఎనిమిది రాష్ట్రాల క్రీడాకారిణులు రాక

తీరంలో 20 మంది గజ ఈతగాళ్లు

ఉప్పలగుప్తం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాంలో ఈ నెల 27 నుంచి 29 వరకు డే అండ్‌ నైట్‌ నేషనల్‌ ఇన్విటేషన మహిళా బీచ్‌ వాలీబాల్‌ పోటీలకు క్రీడా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఎస్‌.యానాంలో టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే ప్రయత్నంలో భాగంగా బీచ్‌ వాలీబాల్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు వాలీబాల్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు చెప్పారు. ఫ్లడ్‌ లైట్ల వెలుగులో డై అండ్‌ నైట్‌ మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. శుక్రవారం ప్రారంభో త్సవానికి పలువురు రాష్ట్ర మంత్రులు హాజరవుతారని తెలిపారు. అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఆధ్వర్యంలో రూరల్‌ సీఐ ప్రశాంత్‌కుమార్‌, ఎస్‌ఐ చలమల రాజేష్‌ క్రీడా ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లపై గురువారం ఎమ్మెల్యేతో చర్చించారు. క్రీడా ప్రాంగణంలో టెక్నికల్‌ టీమ్‌కు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. సముద్ర తీరాన 20 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుతామని వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పలచోళ్ల పద్మనాభం వివరించారు. టోర్నీని తిలకించేందుకు వచ్చే క్రీడాభిమానులకు అనుగుణంగాభద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం కీలక ప్రదేశాల్లో పోలీసులను నియమిస్తామన్నారు.

ఎస్‌.యానాం బీచ్‌కు చేరుకోవచ్చు ఇలా..

అమలాపురం, రాజమహేంద్రవరం వైపుల నుంచి వచ్చే క్రీడాభిమానులు అమలాపురం నుంచి నేరుగా ఎస్‌.యానాం బీచ్‌కు రావచ్చు. కాకినాడ నుంచి వచ్చేవారు పల్లంకుర్రు రూట్లో కాట్రేనికోన నుంచి ఆర్‌అండ్‌బీ రహదారిలో నేరుగా ఎస్‌.యానాం రావచ్చు. ప్రధాన గ్రామం నుంచి బీచ్‌ వరకు మూడు కిలో మీటర్ల మేర సీసీ రహదారి వేశారు.

లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో పోటీలు

ప్రతిరోజు ఆరు మ్యాచలు నిర్వహిస్తాం

గొలకోటి ఫణీంద్రకుమార్‌, వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యనిర్వాహక కార్యదర్శి, ఫిజికల్‌ డైరెక్టర్‌

ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, గోవా, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, బెంగాల్‌, వేల్స్‌ యూనివర్సిటీ మహిళా జట్లు టోర్నమెంటులో పాల్గొంటున్నాయి. ప్రతిరోజూ ఆరు మ్యాచ్‌లు జరిగేలా ఏర్పాట్లు చేశాం. లీగ్‌ కం నాకౌట్‌ పద్ధతిలో పోటీలు జరుగుతాయి. టెక్నికల్‌ టీమ్‌ సహకారంతో క్రీడా ప్రాంగణాన్ని అధునాతన విధానంలో సిద్ధం చేశాము. క్రీడాభిమానులు కూర్చుని చూసేందుకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశాము.

Updated Date - Dec 27 , 2024 | 12:44 AM