ముగిసిన బాలల పండుగ
ABN , Publish Date - Feb 12 , 2024 | 01:05 AM
విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో కూడా రాణించాలని పలువురు ప్రముఖలు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రెండు రోజుల పాటు ఉత్సాహంగా జరిగిన గోదావరి బాలోత్సవం పిల్లల పండుగ ఆదివారంతో ముగిసింది.
![ముగిసిన బాలల పండుగ](https://media.andhrajyothy.com/media/2023/20231205/11_RJYURBAN_1_a057c081b8.gif)
రెండు రోజుల పాటు పిల్లలకు పండగే
హాజరైన 5600 మంది చిన్నారులు
అన్ని విభాగాల్లో అలరించారు..
రాజమహేంద్రవరం అర్బన్, ఫిబ్రవరి 11 : విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో కూడా రాణించాలని పలువురు ప్రముఖలు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రెండు రోజుల పాటు ఉత్సాహంగా జరిగిన గోదావరి బాలోత్సవం పిల్లల పండుగ ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం కార్పొరేషన్ మాజీ కమిషనర్ ఎం.జితేంద్ర మాట్లా డుతూ మంచి సమాజం కోసం అవసరమైన మానవ వనరులు అందించేందుకు ఇలాంటి బాలోత్సవాలు ఎంతో అవసరమన్నారు. నాట్యాచార్యుడు సప్పా దుర్గాప్రసాద్, శ్రీ వెంకటేశ్వరా ఫైనాన్స్ అధినేత వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యతో పాటు సమాజం పట్ల బాధ్యతను పెంచుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్ఐసీ బ్రాంచి మేనేజర్ ఎన్ఎస్ఎస్ శర్మ, ఎల్ఐసీ ఏవో ఆర్.రామ్మోహనరావు, కవి అరిపిరాల నారాయణరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలను నాటడం ద్వారా సమాజాన్ని కాపాడుకోవడానికి దోహదపడాలని సూచించారు. గోదావరి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి పీఎస్ఎన్ రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.తులసి రెండు రోజుల పాటు జరిగిన వివిధ పోటీల్లో 5,600 మంది పాల్గొని తమ ప్రతిభ చాటారన్నారు. రెండో రోజున కూడా కల్చరల్, అకడమిక్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. క్లాసికల్, జానపద నృత్యాలు, కోలాటం, మట్టితో బొమ్మల తయారీ వంటి పోటీలు నిర్వహించారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజేతలకు మెడల్స్, మెమొంటోలు అందజేశారు.ఈ కార్యక్రమాన్ని అమరావతి బాలోత్సవం నిర్వాహకులు టి.క్రాంతికుమార్, సంఘసేవకులు మాటూరి సిద్ధార్థ, భాస్కర్, డాక్టర్ చైతన్యశేఖర్, బాలోత్సవం అసోసియేట్ అధ్యక్షుడు కృష్ణకుమార్ పర్యవేక్షించారు.