అంతర్వేది లక్ష్మీనరసింహుని కల్యాణోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Feb 17 , 2024 | 12:19 AM
ఆర్తజన రక్షకుడు అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి రోజున వార్షికంగా బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబీకులు తొలి పూజలు నిర్వహించారు.
అంతర్వేది, ఫిబ్రవరి 16: ఆర్తజన రక్షకుడు అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి రోజున వార్షికంగా బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబీకులు తొలి పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపించారు. ఆలయ స్థానాచార్యులు వింజమూరి రామరంగాచార్యులు సమక్షంలో ప్రధానార్చకులు పాణింగపల్లి శ్రీనివాసకిరణ్, పెద్దింటి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో శ్రీవారికి వైఖానస ఆగమానుసారం, వైష్ణవ సంప్రదాయం ప్రకారం పూజలు జరిగాయి. ఉదయం సుప్రభాత సేవ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపారు. తిరువారాధన, బాలభోగం, పంచామృత అభిషేకాలు జరిగాయి. బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయం వద్ద అన్నసమారాధన చేశారు. శ్రీకర, శుభకర, ప్రణయ స్వరూపుడైన ఆది దేవుడు శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని పెండ్లి కొడుకుగాను, అమ్మవారిని పెండ్లి కుమార్తెగాను తీర్చిదిద్దే అపూర్వ ఘట్టానికి శుక్రవారం అంతర్వేది ఆలయం వేదికైంది. ఆచారం ప్రకారం కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబాల సంయుక్త నిర్వహణలో సాయంత్రం 6.30 గంటలకు ధూపసేవ అనంతరం ముద్రికాలంకరణ నిర్వహించారు. విశేష పూజలందుకున్న స్వామి, అమ్మవార్లను అర్చకులు పెళ్లికి సిద్ధం చేశారు. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో నీలమేఘశ్యాముడైన స్వామివారికి బుగ్గన చుక్క పెట్టడంతో పెండ్లి కొడుకుగా దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లకు బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబీకులు వార్షిక ఉంగరాలను సమర్పించారు. రెండు కుటుంబాల ఆడపడుచులు స్వామి, అమ్మవార్లకు హారతులు పట్టి ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ సహాయ కమిషనరు వి.సత్యనారాయణ, ఆలయ ఫ్యామిలీ ఫౌండర్, చైర్మన్రాజా కలిదిండి కుమారరామ గోపాలరాజా బహుదూర్, ఉండపల్లి, బెల్లంకొండ, ముప్పర్తి కుటుంబ సభ్యులు, కొపనాతి కృష్ణమ్మ కుటుంబ సభ్యులు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, మాజీ సర్పంచ్ వనమాలి మూలాస్వామి, కేఎస్ఎన్ రాజు, వలవల రాంబాబు, సర్పంచ్ కొండా జాన్బాబు, ఎంపీటీసీ బైరా నాగరాజు, వాహనకారులు తదితరులు పాల్గొన్నారు.