అంగన్వాడీలపై ‘ఎస్మా’.. అక్రమం
ABN , Publish Date - Jan 07 , 2024 | 11:44 PM
అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం క్షమించరాని తప్పు అని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణ అన్నారు. కొవ్వూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 27వ రోజు కొనసాగింది.
![అంగన్వాడీలపై ‘ఎస్మా’.. అక్రమం](https://media.andhrajyothy.com/media/2023/20231205/7_NDD_3_05c42613b1.jpg)
పౌరుల స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు, హక్కులను హరించడమే
పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీమన్నారాయణ
27వ రోజు కొనసాగిన అంగన్వాడీలు సమ్మె
దేవరపల్లిలో మోకాళ్లపై, సాష్టాంగ నమస్కారాలతో నిరసన
కొవ్వూరు, జనవరి 7: అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం క్షమించరాని తప్పు అని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణ అన్నారు. కొవ్వూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 27వ రోజు కొనసాగింది. సమ్మెకు మద్దతు తెలిపిన శ్రీమన్నారాయణ మాట్లాడుతూ అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చేస్తున్న సమ్మెను అణగదొక్కాలని ఎస్మా ప్రయోగించి నిషేధాన్ని విధించడం అక్రమమని, ప్రజాస్వామ్య సమాజంలో పౌరుల స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను, హక్కులను హరించడమేనన్నారు. ఎస్మాను తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీహెచ్.పుష్పావతి, బి.పద్మజ, మంగతాయారు, మల్లిక, పద్మ, భవాని, శ్రీదేవి పాల్గొన్నారు. అలాగే ఐఎఫ్టీయూ నాయకులు సీహెచ్ రమేష్, పి.నాగేశ్వరరావు ఆద్వర్యంలో అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా లారీ డ్రైవర్లు, వర్కర్లు ఎస్మా పత్రాలను దహనం చేసి నిరసన ప్రదర్శన చేపట్టారు.