7 నుంచి అమృత్ భారత్ రైలు రాకపోకలు
ABN , Publish Date - Jan 01 , 2024 | 12:20 AM
పశ్చిమబంగాలోని మాల్డా టౌన్- ఎస్ఎంవీటి బెంగళూరు మధ్య నూతనంగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ జనవరి 7 నుంచి రాకపోకలు ప్రారంభించనుంది.
![7 నుంచి అమృత్ భారత్ రైలు రాకపోకలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సామర్లకోట, డిసెంబరు 31: పశ్చిమబంగాలోని మాల్డా టౌన్- ఎస్ఎంవీటి బెంగళూరు మధ్య నూతనంగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ జనవరి 7 నుంచి రాకపోకలు ప్రారంభించనుంది. ఈ ఎక్స్ప్రెస్ రైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, గుంతకల్ రైల్వే డివిజన్ల పరిధిలో 11 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగనుంది. సామర్లకోట, తుని రైల్వే స్టేషన్లతో పాటు రాజమండ్రి స్టేషన్ కూడా వాటిలో ఉంది. అలాగే ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వేస్టేషన్లలో ఆగుతుంది. ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు మాల్డా టౌన్ నుంచి ప్రతి ఆదివారం, బెంగళూరు నుంచి ప్రతి మంగళవారం ప్రయాణిస్తుంది. వారాంతపు ఎక్స్ప్రెస్ రైలుగా అత్యంత వేగవంతమైన, అనుకూలమైన, అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణ రైలుగా రైల్వే ఉన్న తాధికారులు తెలిపారు. ఇది పూర్తిగా నాన్-ఏసీ రైలు. స్లీపర్ కోచ్లు, జనరల్ కోచ్లు ఉంటాయి. 13434 నంబరు గల మాల్డా టౌన్- ఎస్ఎంవీటీ బెంగళూరు రైలు మాల్డా టౌన్ నుంచి ఆదివారం ఉదయం 8.50 నిమిషాలకు బయలుదేరనుంది. ఈ రైలు తుని రైల్వే స్టేషన్కు సోమవారం ఉదయం 7.19కి చేరుకుని 7.20కి బయలుదేరుతుంది. సామర్లకోట స్టేషన్కు 7.54కి చేరుకుని తిరిగి 7.55కి బయలుదేరుతుంది. రాజమండ్రి స్టేషన్కు 8.34కు చేరుకుని తిరిగి 8.36కి చేరుతుంది. బెంగళూరుకు మంగళవారం తెల్ల వారుజామున 3 గంటలకు వెళుతుంది. రైలు నంబరు 13433 ఎస్ఎంవీటి బెంగళూరు-మాల్డా టౌన్ మధ్య ప్రతీ మంగళవారం మధ్యాహ్నం 1.50కి బయలుదేరుతుంది. బుధవారం తెల్లవారుజామున 4.18కి రాజమండ్రి చేరుకుని తిరిగి 4.20కి బయలుదేరుతుంది. సామర్లకోటకు ఉదయం 5.04 కి చేరుకుని తిరిగి 5.05 కి బయలు దేరుతుంది. తుని స్టేషన్కు ఉదయం 5.59కి చేరుకుని తిరిగి 6.00 బయలుదేరుతుంది. మాల్డా టౌన్కు గురువారం ఉదయం 11 గంటలకు చేరుతుంది. ఈ ఎక్స్ప్రెస్ రైలు జనవరి 9న మంగళవారం మధ్యాహ్నం 1.50కి బయలుదేరుతుంది.