దళిత కుటుంబాన్ని వెలివేసిన వారిని శిక్షించాలి
ABN , Publish Date - May 30 , 2024 | 12:44 AM
దళిత కుటుంబాన్ని వెలివేత పేరుతో మానసికంగా హత్య చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు డిమాండు చేశారు.
![దళిత కుటుంబాన్ని వెలివేసిన వారిని శిక్షించాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమలాపురం టౌన్, మే 29: దళిత కుటుంబాన్ని వెలివేత పేరుతో మానసికంగా హత్య చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు డిమాండు చేశారు. అమలాపురం దుడ్డువారి అగ్రహారంలో నివాసం ఉంటున్న తాళ్ల పల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను విదసం ఆధ్వర్యంలో పలువురు నాయకులు బుధవారం కలుసుకున్నారు. జరిగిన ఘటనలపై నిజనిర్ధారణ చేశారు. అమలాపురం నడిబొడ్డున ఓ దళిత కుటుంబం సాంఘిక బహిష్కరణకు గురికావడం దారుణమన్నారు. 2019లోనే స్వేచ్ఛాయుత ఓటింగ్ కోసం ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లినా 2024 వరకు సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోకపోవడం అన్యాయమన్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి ఫిర్యాదు చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ పంపించిన నోటీసు ప్రతిని కలెక్టర్కు అందజేశారు. రాష్ట్ర సహాయ కన్వీనర్ ఈతలపాక సుజాత మాట్లాడుతూ దళిత నియోజకవర్గ కేంద్రంలో కుల వెలి జరిగితే దళిత ప్రజాప్రతినిధులకు కనిపించలేదా అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందు వల్ల కోడ్ ముగిసిన తర్వాత రోడ్డు నిర్మాణానికి ఆదేశిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు వెంకటరావు తెలిపారు. కార్యక్రమంలో కోనసీమ ఐక్య వేదిక నాయకులు రేవు తిరుపతిరావు, అమలదాసు బాబూరావు, జాజీ ఓంకార్, గుడివాడ ప్రసాద్, మందా శ్రీనివాస్, సీహెచ్ తులసీరావు, బొంత శ్యామరవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా శాఖ ప్రతినిధుల బృందం పల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను కలిసింది. జరిగిన ఘటనలపై కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బత్తుల నకులరాజు, ప్రధాన కార్యదర్శి గోసంగి బంగార్రాజు, ఆర్థిక కార్యదర్శి సాధనాల సత్యనారాయణ, గెడ్డం ప్రదీప్, నేరేడుమిల్లి సత్యనారాయణ, నందిక వెంకటేశ్వరరావు, గుత్తాల వెంకటేశ్వరరావు, కాశి వెంకట్రావు, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.