Share News

AP Election Results: అన్ని కోల్పోయిన షర్మిల.. నెక్స్ట్ ఏంటి ?

ABN , Publish Date - Jun 04 , 2024 | 07:21 PM

అయిపోయింది.. అంతా అయిపోయింది. రాజన్న ముద్దుబిడ్డ.. గారలపట్టి వైయస్ షర్మిలకు మాత్రం రాజకీయ యోగం లేకుండా పోయిందని మహానేత వైయస్ఆర్ అభిమానుల్లో ఓ చర్చ అయితే వాడివేడిగా సాగుతుంది.

AP Election Results: అన్ని కోల్పోయిన షర్మిల.. నెక్స్ట్ ఏంటి ?

అయిపోయింది.. అంతా అయిపోయింది. రాజన్న ముద్దుబిడ్డ.. గారలపట్టి వైయస్ షర్మిలకు మాత్రం రాజకీయ యోగం లేకుండా పోయిందని మహానేత వైయస్ఆర్ అభిమానుల్లో ఓ చర్చ అయితే వాడివేడిగా సాగుతుంది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి.. సోదరుడు వైయస్ అవినాష్ రెడ్డి చేతిలో వైయస్ షర్మిల ఘోర పరాజయం పాలైంది. దీంతో ఆమెకు రాజకీయంగా కలిసి రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్న తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆహార్యం, హవభావాలతోపాటు ఆయన లక్షణాలను సైతం షర్మిల పుణికి పుచ్చుకున్నారని ఈ సందర్భంగా వారు వివరిస్తున్నారు. కానీ ఆమెకు రాజకీయంగా ఎందుకు కలిసి రావడం లేదని వారు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు.


అయితే 2014 నుంచి 2024 వరకు ఓ దశాబ్దం పాటు వైయస్ షర్మిల జీవితంలో చోటు చేసుకున్న వరుస పరిణామాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకుంటున్నారు. ప్రతిపక్షనేత వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో 16 నెలలు చంచల్‌గూడ జైల్లో ఉంటే.. సోదరుడికి మద్దతుగా, పార్టీని ప్రజల్లో నిలబెట్టడం కోసం వేలాది కిలోమీటర్ల మేర ఆమె పాదయాత్ర సైతం చేసిందని పేర్కొంటున్నారు. ఇక 2019 ఎన్నికల్లో వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడంతో.. అతడితో విభేదాలు వచ్చాయని చెబుతున్నారు. దీంతో వైయస్ షర్మిల పక్క రాష్ట్రం తెలంగాణ వెళ్లి.. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిందని వివరిస్తున్నారు. ఆ క్రమంలో ఆ రాష్ట్రంలో రాజకీయంగా వైయస్ షర్మిల తీవ్ర వ్యతిరేక పరిస్థితులను సైతం ఎదుర్కొన్నారని వైయస్ఆర్ అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.


దీంతో వైయస్ఆర్ టీపీని తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కన్నతండ్రికి అత్యంత ఇష్టమైన కాంగ్రెస్ పార్టీలో ఆమె విలీనం చేశారని చెబుతున్నారు. అనంతరం ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు సైతం ఆమె చేపట్టారని.. దీంతో కడప లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి వైయస్ షర్మిల ఓడారని వారు వివరిస్తున్నారు. ఈ దశాబ్ద ప్రయాణంలో రాజన్న ముద్దుబిడ్డ వైయస్ షర్మిల పరిస్థితి దాదాపుగా అన్నింటిని కోల్పోయిందని వైయస్ఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.


ఎందుకంటే వైయస్ జగన్‌తో ఉన్న రక్తబంధం తెగిపోయిందని.. అలాగే మెట్టినిల్లు తెలంగాణలో రాజకీయం చేసి... మళ్లీ పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చేసిందని వివరిస్తున్నారు. తాజాగా కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిందని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తన తండ్రి తుది శ్వాస వరకు కొనసాగిన హస్తం పార్టీతోనే తన స్నేహ హస్తం ఇచ్చి కొనసాగిస్తుందా? లేకుంటే.. అనుబంధం అత్మీయ అంతా ఒక బూటకం అంటూ సైలెంట్‌గా సైడ్ అయిపోతారా? అని వైయస్ షర్మిల రాజకీయ భవిష్యత్తుపై మహానేత అభిమానులు ఓ విధమైన నిర్వేదంతో చర్చించుకుంటున్నారు.

Read Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 04 , 2024 | 07:24 PM