Share News

‘ఎస్మా’ ప్రయోగిస్తారా?

ABN , Publish Date - Jan 07 , 2024 | 01:55 AM

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న తమపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడం పట్ల అంగన్వాడీ ఉద్యోగులు శనివారం జిల్లావ్యాప్తంగా ఆందోళనకు దిగారు.

‘ఎస్మా’ ప్రయోగిస్తారా?
తిరుపతిలో ఎస్మా చట్టం ప్రతులను తీసుకోవడానికి నిరాకరణ

జీవో ప్రతులను తగులబెట్టిన అంగన్వాడీలు

తిరుపతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న తమపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడం పట్ల అంగన్వాడీ ఉద్యోగులు శనివారం జిల్లావ్యాప్తంగా ఆందోళనకు దిగారు. నిరవధిక సమ్మెలో భాగంగా ఓవైపు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూనే మరోవైపు ఎస్మా ప్రయోగానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నాయుడుపేట, కోటల్లో రిలే నిరాహార దీక్ష కొనసాగించిన ఉద్యోగులు శిబిరం వద్ద ఎస్మా ప్రయోగానికి సంబంధించిన జీవో నెంబరు-2 ప్రతులను తగులబెట్టారు. తిరుపతిలో పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద, సత్యవేడు, పిచ్చాటూరుల్లో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల ఎదుట కళ్లకు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చంద్రగిరిలో రిలే నిరాహార దీక్షా శిబిరంలో మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేయగా.. గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, పుత్తూరు, శ్రీకాళహస్తి తదితర చోట్ల రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు.

వెనుదిరిగిన తిరుపతి సీడీపీవో

ఎస్మా చట్టానికి సంబంధించిన జీవో ప్రతులను ఇవ్వడానికి శనివారం సాయంత్రం తిరుపతిలోని అంగన్వాడీల దీక్షా శిబిరానికి సీడీపీవో సుధారాణి వచ్చారు. దాంతో సమస్యలు పరిష్కరించకుండా ఇదేంటని ప్రశ్నిస్తూ.. ప్రతులను తీసుకోవడానికి నిరాకరించారు. దాంతో ఆమె చేసేదేమీలేక వెనుదిరిగారు.

Updated Date - Jan 07 , 2024 | 01:56 AM