ఖరీఫ్ సాగుకు ప్రణాళికేది?
ABN , Publish Date - May 18 , 2024 | 12:39 AM
ఖరీఫ్ సీజన్ మరో పక్షం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ఏడాది రుతుపవనాలు అనుకూలంగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుండడంతో రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే దానికి తగినట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేయకపోవడం విమర్శలు దారితీస్తోంది. సబ్సిడీపై అందించే వేరుశనగ, పచ్చిరొట్ట విత్తనాలు, ఎరువులు ఎప్పుడు ఇస్తారనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. సాధారణంగా మే మూడో వారంలోనే రైతులు దుక్కులతోపాటు వేరుశనగ విత్తనాలు శుద్ధి చేసుకుని సిద్ధంగా కావాల్సి ఉంది.
దుక్కులు సిద్ధం చేసుకుంటున్న రైతులు
చిత్తూరు (సెంట్రల్), మే 17: ఖరీఫ్ సీజన్ మరో పక్షం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ఏడాది రుతుపవనాలు అనుకూలంగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుండడంతో రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే దానికి తగినట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేయకపోవడం విమర్శలు దారితీస్తోంది. సబ్సిడీపై అందించే వేరుశనగ, పచ్చిరొట్ట విత్తనాలు, ఎరువులు ఎప్పుడు ఇస్తారనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. సాధారణంగా మే మూడో వారంలోనే రైతులు దుక్కులతోపాటు వేరుశనగ విత్తనాలు శుద్ధి చేసుకుని సిద్ధంగా కావాల్సి ఉంది.
సాగు విస్తీర్ణం లెక్కలేవి సారూ
ఏటా ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని 2.22 లక్షల మంది రైతులు 2,27,500 ఎకరాల్లో దాదాపు 23 రకాలైన పంటలు సాగు చేస్తుంటారు. వర్షాధారిత ప్రధాన పంటగా వేరుశనగ, తూర్పు మండలాల్లో వరి, చెరకు, పశుగ్రాసం, రాగి, కందులు, ఉలవలు, అనుములు, ఆముదం, మొక్కజొన్న, కొర్రలు, సామలు, పెసర, పత్తి వంటి పంటలు సాగు చేస్తుంటారు. ఖరీఫ్ ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది ఎంతమంది రైతులు ఏయే రకాల పంటలు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే దానిపై జిల్లా వ్యవసాయాధికారులు ఇప్పటివరకు లెక్కలు కట్టలేదు.
ఊసేలేని సబ్సిడీ విత్తనాలు
ఖరీఫ్లో సాధారణంగా జిల్లాలో 1,27,500 ఎకరాల్లో వర్షాధార పంటగా వేరుశనగ సాగు చేస్తారు. ఇందుకనుగుణంగా 38,688 క్వింటాళ్ల వేరుశనగ, 1,548 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు, 32,836 మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలని జిల్లా వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఏటా మే మూడో వారంలో సబ్సిడీ విత్తనకాయలు జిల్లాలోని 502 రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించేవారు. ఈ ఏడాది ఇప్పటివరకు సబ్సిడీ ధరలు నిర్ణయించకపోవడంతో విత్తనకాయల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఉద్యాన పంటలపై దృష్టి
వ్యవసాయాధికారుల నిర్లక్ష్య వైఖరిపై విసుగుచెందిన రైతులు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. రెండేళ్లుగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా బావులు, చెరువులు, కుంటల్లో నీరు చేరాయి. దీంతో రైతులు నీటి ఆధారిత పంటలు సాగు చేశారు. ఈ ఏడాది సరైన ప్రణాళిక లేకపోవడంతో పలమనేరు, బైరెడ్డిపల్లి, వి.కోట, కుప్పం ప్రాంత రైతులు కూరగాయలు, పూలు, పట్టు తదితర పంటల సాగుపై మొగ్గు చూపుతున్నారు.
ఆర్బీకేల్లో సమాచారం కరవు
రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులకు సంబంధించిన సమాచారం అడిగినా చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారు. 244 ఆర్బీకేల్లో క్లస్టమైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, సాగులో రైతులకు అవసరమైన పరికరాలు ఏవేవి అందుబాటులో ఉన్నాయి..వాటి అద్దె ఎంత అనే వివరాలు ప్రదర్శించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
అందని మట్టి నమూనా ఫలితాల కార్డులు
మట్టిలో లోపాలను తెలుసుకుని, తగిన పోషకాలు నేలకు అందించడంలో భూసార పరీక్షలు కీలకం. జిల్లావ్యాప్తంగా 6,860 మట్టి నమూనాలు సేకరించిన అధికారులు, ఫలితాల కార్డులను రైతులకు అందించలేదు. కాగా వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింది 2024-25 సంవత్సరానికి 9 క్లస్టర్లను ఎంపిక చేశారు. వీటి కార్యాచరణపై ఇప్పటివరకు స్పష్టత లేదు.