Share News

బీసీవైపార్టీ వాహనాలొస్తే కాల్చేస్తాం

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:37 AM

మా గ్రామానికి బీసీవై పార్టీ వాహనాలు రాకూడదు. ఒకవేళ వస్తే పెట్రోల్‌ పోసి కాల్చేస్తాం’ అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అల్టిమేటం జారీ చేశారు.

బీసీవైపార్టీ వాహనాలొస్తే కాల్చేస్తాం
ప్రచార రథాలను ధ్వంసం చేస్తున్న వైసీపీ నేత హరినాథరెడ్డి

పుంగనూరు, ఏప్రిల్‌ 12: ‘మా గ్రామానికి బీసీవై పార్టీ వాహనాలు రాకూడదు. ఒకవేళ వస్తే పెట్రోల్‌ పోసి కాల్చేస్తాం’ అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అల్టిమేటం జారీ చేశారు. సదుం మండలం రెడ్డివారిపల్లె పంచాయతీ చిలకపాటివారిపల్లెకు శుక్రవారం సాయంత్రం వచ్చిన బీసీవైపీ (భారత చైతన్య యువజన పార్టీ) వాహనాలను ధ్వంసం చేశారు. ఆ పార్టీ నేతలపైనా దాడి చేశారు. బీసీవై పార్టీ నాయకులు ఆనందరెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి మాట్లాడుతూ.. సదుం, పులిచెర్ల మండలాల్లో తమ పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి నుంచి అనుమతి పొందామన్నారు. రాత్రివేళ ఈ వాహనాలను ఆనందరెడ్డి ఇంటి వద్ద పెట్టుకునేందుకు చిలకపాటివారిపల్లెకు తీసుకొచ్చామన్నారు. గ్రామంలోకి రాగానే వైసీపీ నాయకుడు హరినాథరెడ్డి, మరికొందరు నేతలు, కార్యకర్తలు కర్రలతో దాడి చేసి వాహనాలను ధ్వంసం చేసినట్లు చెప్పారు. తమను దుర్భాషలాడారన్నారు. గ్రామం నుంచి వెంటనే వెళ్లిపోకుంటే చంపేస్తామని బెదిరించారన్నారు. ఆనందరెడ్డి ఇంటిపైనా రాళ్లు వేశారన్నారు. వాహనాలపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టడానికి ప్రయత్నించగా.. అప్పటికే తమ సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులు వారిని అడ్డుకున్నట్లు తెలిపారు. కాగా, విచారణ పేరిట పోలీసులు ఆనందరెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డిని పోలీసు స్టేషనుకు తీసుకెళ్లారు. తమపై జరిగిన దాడికి సంబంధించి వీరిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అనుచరులు చేస్తున్న దాడులు, వాహనాల ధ్వంసం చేసిన సంఘటనపై బీసీవైపార్టీ అధినేత రామచంద్రయాదవ్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.

Updated Date - Apr 13 , 2024 | 01:37 AM