మళ్లీ నారాయణస్వామేనా.. మాకొద్దు!
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:50 AM
గంగాధరనెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ మళ్లీ నారాయణస్వామికి కాకుండా కొత్తవారికి ఇవ్వాలంటూ గంగాధరనెల్లూరులో సోమవారం వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ర్యాలీగా వెళ్లి పెట్రోల్ బంకువద్ద గల వైఎస్సార్ విగ్రహానికి వీరంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గంగాధరనెల్లూరు, ఫిబ్రవరి 5: గంగాధరనెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ మళ్లీ నారాయణస్వామికి కాకుండా కొత్తవారికి ఇవ్వాలంటూ గంగాధరనెల్లూరులో సోమవారం వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ర్యాలీగా వెళ్లి పెట్రోల్ బంకువద్ద గల వైఎస్సార్ విగ్రహానికి వీరంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధిక్కరిస్తున్నామని అనుకోవద్దంటూ సీఎం జగన్ను ఉద్దేశించి అంటూనే తమ డిమాండును ప్రకటించారు. సీడీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేల్కూరు బాబురెడ్డి మాట్లాడుతూ ఇక్కడ నారాయణస్వామి పోటీచేస్తే కంచుకోటగా భావించే స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నారు. అబ్బూ సాంబశివారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే నారాయణస్వామిని కలిసేందుకు పుత్తూరుకు నాలుగుసార్లు తాను వెళ్తే అనవసర మాటలతో తిప్పి పంపించడమే కాకుండా కేసుపెట్టి ఇరికిస్తానని బెదిరించారని ఆరోపించారు. నారాయణ స్వామికే టికెట్ ఇస్తే, ఆరు మండలాల్లోనూ వైసీపీలోని ఒకవర్గం పనిచేస్తే మరో నాలుగువర్గాలు పనిచేయవని స్పష్టం చేశారు. వెజ్జుపల్లె మాజీ సర్పంచ్ నాయనరెడ్డి మాట్లాడుతూ ఆయనకే ఎమ్మెల్యే టికెట్ కొనసాగిస్తే తామెవరం పనిచేయమని, ఓటేసేందుకు సైతం వెళ్లమని ప్రకటించారు. రాష్ట్ర వైసీసీ సంయుక్త కార్యదర్శి శివప్రకా్షరాజు, జిల్లా వైసీపీ ప్రధానకార్యదర్శి దయాసాగర్రెడ్డి, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ గుణశేఖర్ మొదలి, డిప్యూటీ సీఎం సోదరి కుమారుడు రమేష్, పెనుమూరు జడ్పీటీసీ దొరస్వామిమందడి, కార్వేటినగరం ధనంజయరెడ్డి, బాలయ్యకొత్తూరు ప్రభాకర్రెడ్డి, గోవిందరెడ్డి, దేవేంద్రరెడ్డి, షైనీ శేఖర్, మోహన్ ఆరు మండలాల నుంచి పలువురు వైసీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనుకూలవర్గం ధర్నా
కాగా, నారాయణస్వామి అనుకూలవర్గం చిత్తూరు - పుత్తూరు రహదారిపై ధర్నా చేశారు. నారాయణస్వామి జిందాబాద్, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. నారాయణస్వామి వ్యతిరేకవర్గంతో అంతకుముందు వీరు వాగ్వావాదానికి దిగారు. పోలీసులు కలగజేసుకుని సర్దిచెప్పారు. ఆర్బీకేల మండల అడ్వైజరీ కమిటీ చైర్మన్ బలరామిరెడ్డి, మండల వైస్ ఎంపీపీ హరిబాబు, నేతలు బట్టుజంగనపల్లె వెంకటే్షరెడ్డి, మోహన్, జగన్, ఏసు, గిరిబాబు ఈ బృందంలో ఉన్నారు.