Share News

వీఆర్‌ఏలూ సమ్మె బాటే..!

ABN , Publish Date - Jan 12 , 2024 | 01:07 AM

తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే 20వ తేది తర్వాత సమ్మెలోకి వెళ్తామని వీఆర్‌ఏలూ స్పష్టంచేశారు.

వీఆర్‌ఏలూ సమ్మె బాటే..!

చిత్తూరు రూరల్‌, జనవరి 11: ఇప్పటికే అంగన్వాడీలు, సమగ్రశిక్షా అభియాన్‌ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. 108, 104 ఉద్యోగులూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే 20వ తేది తర్వాత సమ్మెలోకి వెళ్తామని స్పష్టంచేశారు. తాజాగా.. వీఆర్వోఏలూ సమ్మె నిర్ణయం తీసుకున్నారు. వీరూ 20వ తేదీనే డెడ్‌లైన్‌గా పెట్టారు. అప్పటిలోగా తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె బాట పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు చిత్తూరులోని సీఐటీయూ కార్యాలయంలో గురువారం వీఆర్‌ఏ సంఘ ముఖ్యనేతలతో రాష్ట్ర నాయకుడు అంజి సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. రూ.26 వేల కనీస వేతనం అమలు, టీఏ. డీఏల పెంపు, అటెండర్‌ ప్రమోషన్లలో 70శాతం పర్సంటేజ్‌ పెంచాలని డిమాండు చేశారు. అనంతరం డీఆర్వో రాజశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకుడు చైతన్య, వీఆర్‌ఏలు పాల్గొన్నారు. ఇలా ఆయా శాఖల ఉద్యోగులు సమ్మెవైపు అడుగులు వేస్తుండటం గమనార్హం.

Updated Date - Jan 12 , 2024 | 06:41 AM