ఎస్పీగా సుబ్బరాయుడు
ABN , Publish Date - Jul 14 , 2024 | 01:07 AM
తిరుపతి జిల్లాకు ఎస్పీగా ఎల్. సుబ్బరాయుడు నియమితులయ్యారు. అనంతపురం జిల్లా బండమీదపల్లెకు చెందిన సుబ్బరాయుడు 2007లో డీఎస్పీగా పోలీసు శాఖలో అడుగుపెట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురం, ఏలూరుల్లో డీఎస్పీగా పనిచేసిన తర్వాత నిజామాబాద్, అనంతపురం ,కరీంనగర్ జిల్లాల్లో అదనపు ఎస్పీగా పనిచేశారు. 2013లో ఐపీఎస్ హోదా లభించింది.
తిరుపతి(నేరవిభాగం), జులై 13 : తిరుపతి జిల్లాకు ఎస్పీగా ఎల్. సుబ్బరాయుడు నియమితులయ్యారు. అనంతపురం జిల్లా బండమీదపల్లెకు చెందిన సుబ్బరాయుడు 2007లో డీఎస్పీగా పోలీసు శాఖలో అడుగుపెట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురం, ఏలూరుల్లో డీఎస్పీగా పనిచేసిన తర్వాత నిజామాబాద్, అనంతపురం ,కరీంనగర్ జిల్లాల్లో అదనపు ఎస్పీగా పనిచేశారు. 2013లో ఐపీఎస్ హోదా లభించింది. అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి గవర్నర్ వద్ద సీఎస్ఓగా పనిచేశారు.2014 నుంచి 2019 వరకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద చీఫ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేసి మంచి అనుభవం గడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక తెలంగాణా క్యాడర్కు బదిలీపై వెళ్ళారు. అక్కడ సీఐడీలో ఎస్పీగా పనిచేశారు.2023లో కరీంనగర్ పోలీసు కమిషనర్గా పనిచేసిన ఆయన్ను ఎన్నికల సమయంలో డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన్ను హైదరాబాదు ట్రాఫిక్ డీసీపీగా నియమించారు. అక్కడ పనిచేస్తూ ఏపీకి డిప్యుటేషన్పై రావడానికి దరఖాస్తు చేసుకున్నారు. వారం రోజుల క్రితం ఏపీకి ఇంటర్ క్యాడర్ బదిలీపై వచ్చిన సుబ్బరాయుడు తాజాగా తిరుపతి జిల్లాకు ఎస్పీగా నియమితులయ్యారు.అలాగే ఎర్రచందనం టాస్క్ఫోర్స్ ఎస్పీగా సుబ్బరాయుడికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడి ఎస్పీ హర్షవర్ధన రాజును కడపకు బదిలీ చేశారు.ఆయన ఇక్కడ పని చేసిన రెండు నెలల వ్యవధిలోనే పోలీసు శాఖను గాడిలో పెట్టడానికి కృషి చేశారు. పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యసేవనాన్ని అరికట్టేందుకు ప్రయత్నించారు.