Share News

చిత్తూరు ఎమ్మెల్యేకి తిరుపతి సీటు !

ABN , Publish Date - Mar 14 , 2024 | 01:32 AM

తిరుపతి జనసేన సీటు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు ఖరారైంది. టీడీపీ-బీజేపీలతో పొత్తు కూటమిలో వున్న జనసేనకు తిరుపతి సీటు కేటాయించిన సంగతి తెలిసిందే.టీడీపీ పరంగా తిరుపతి అసెంబ్లీ సీటు తొలినుంచీ కీలకమే. ప్రతిసారీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎంపికపై స్థానికంగానే కాకుండా జిల్లావ్యాప్తంగా కూడా జనం ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ పర్యాయం జనసేనతో పొత్తు కారణంగా అభ్యర్థి ఎంపిక మరింత ఆసక్తికరంగా మారింది.

చిత్తూరు ఎమ్మెల్యేకి తిరుపతి సీటు !
ఆరణి శ్రీనివాసులు

తిరుపతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : తిరుపతి జనసేన సీటు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు ఖరారైంది. టీడీపీ-బీజేపీలతో పొత్తు కూటమిలో వున్న జనసేనకు తిరుపతి సీటు కేటాయించిన సంగతి తెలిసిందే.టీడీపీ పరంగా తిరుపతి అసెంబ్లీ సీటు తొలినుంచీ కీలకమే. ప్రతిసారీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎంపికపై స్థానికంగానే కాకుండా జిల్లావ్యాప్తంగా కూడా జనం ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ పర్యాయం జనసేనతో పొత్తు కారణంగా అభ్యర్థి ఎంపిక మరింత ఆసక్తికరంగా మారింది. ఆరు నెలల కిందటే జనసేనతో పొత్తు వుంటుందని ప్రాధమికంగా నిర్ధారణ కావడంతో పొత్తులో భాగంగా తిరుపతి సీటు జనసేనకే కేటాయిస్తారన్న అంచనా జనంలో మొదలైంది. ఓ దశలో తిరుపతిలో అధికార పార్టీ అభ్యర్థిని ఢీకొనగలిగే వనరులు జనసేన నాయకులకు లేవన్న అభిప్రాయం కలగడంతో సీటు టీడీపీకే దక్కుతుందనే ప్రచారం జరిగింది. ఈలోపు సీట్ల సర్దుబాటు జరగడంతో తిరుపతి సీటు జనసేనకు కేటాయించారు. ఆ వెంటనే బీజేపీ కూడా కూటమిలో చేరడంతో తిరుపతి సీటును బీజేపీ కోరుతుందన్న ప్రచారం ప్రారంభమైంది. ఆలోగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆ పార్టీని వీడి జనసేనలో చేరిపోయారు. సీటు ఏ పార్టీకన్న ప్రచారాలు ఓవైపు సాగుతుండగానే మరోవైపు పరిణామాలు వేగంగా మారిపోయాయి.తిరుపతి సీటు జనసేనకు కేటాయించడంతో టీడీపీ నేతలు సుగుణమ్మ, ఊకా విజయ్‌కుమార్‌ జనసేనలో చేరి టికెట్‌ తెచ్చుకునేందుకు సిద్ధపడ్డారు. వీరి ప్రయత్నాలు కొనసాగుతుండగానే రాజంపేట టీడీపీ నేత గంటా నరహరి బుధవారం జనసేనలో చేరారు. తిరుపతి టికెట్‌ కోసం ఒత్తిడి పెరగడంతో తొలుత చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించారు. సర్వేలో ఆయన పట్ల అత్యధికులు వ్యతిరేకత కనబరిచినట్టు తేలడంతో ఆయన పేరు పక్కన పెట్టి గంటా నరహరి వైపు మొగ్గు చూపుతున్నారని జనసేన, టీడీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ గంటల వ్యవధిలో ఆరణి శ్రీనివాసులును అభ్యర్థిగా పవన్‌ కళ్యాణ్‌ ఖరారు చేశారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. కాగా ఈ పరిణామాలు తిరుపతి నియోజకవర్గ జనసేన, టీడీపీ వర్గాలలో కలకలం రేపాయి. స్థానికులైన బలిజలకే టికెట్‌ కేటాయించాలన్న డిమాండ్‌ గట్టిగా వినిపిస్తున్న నేపధ్యంలో చిత్తూరు ఎమ్మెల్యేకి టికెట్‌ ఖరారు చేయడం వివాదం రేగేందుకు అవకాశమిస్తోంది. ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వం పట్ల టీడీపీ, జనసేన పార్టీల శ్రేణుల స్పందన ఎలా వుంటుందో, రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఈ రెండు పార్టీల్లో ఎలాంటి సమీకరణలకు దారితీస్తుందో వేచి చూడాల్సి వుంది.

Updated Date - Mar 14 , 2024 | 01:32 AM