కార్మికులు మరణిస్తున్నా.. కరగని అధికారుల మనసు
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:28 AM
దీక్ష చేస్తూ కార్మికులు మరణిస్తున్నా, అధికారుల మనసు కరగడం లేదని కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
127వ రోజుకు చేరిన డెయిరీ కార్మికుల దీక్ష
చిత్తూరు (సెంట్రల్), జనవరి 17: దీక్ష చేస్తూ కార్మికులు మరణిస్తున్నా, అధికారుల మనసు కరగడం లేదని కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాలు ఇవ్వాలని కోరుతూ విజయా డెయిరీ కార్మికులు కలెక్టరేట్ ముందు చేపట్టిన దీక్ష బుధవారానికి 127వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల ఈశ్వర్ మొదలియార్ చనిపోగా, రామ్మూర్తి తలలో గడ్డతో తీవ్రంగా బాధపడుతున్నారని, కార్మికుడు సుబ్రమణ్యం కిడ్నీ సమస్యతో బాధపడుతూ సీఎంసీలో చికిత్స పొందుతున్నారన్నారు. దీక్ష చేస్తున్న కార్మికులు స్థోమత లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా, అధికారుల మనసు మాత్రం కరగకపోవడం దారుణమన్నారు. ఇకనైనా తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. దీక్షలో పలువురు కార్మికులు పాల్గొన్నారు.