బెస్తపల్లెలో అడవి పందుల బీభత్సం
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:54 AM
ఐరాలకు కూతవేటు దూరంలోని బస్తపల్లెలో మంగళవారం అడవి పందులు బీభత్సం సృష్టించాయి.

ఐరాల, మార్చి 5: ఐరాలకు కూతవేటు దూరంలోని బస్తపల్లెలో మంగళవారం అడవి పందులు బీభత్సం సృష్టించాయి. అడవి పందుల గుంపు నీటి కోసం గ్రామానికి సమీపంలోని వ్యవసాయ పొలాల వద్దకు వేకువ జామున వచ్చాయి. ఈ క్రమంలో అడవి పందుల గుంపు గ్రామం ముందున్న ఓ నేల బావిలో ఒకదాని తరువాత ఒకటి పడిపోయాయి. ఉదయం వెలుతురు వచ్చిన తర్వాత అడవి పందులు భయానికి గురై ఉదయం 5గంటల నుంచి ప్రయత్నించి 9గంటల ప్రాంతంలో బయటపడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన బెస్తపల్లె గ్రామస్తులు భయంతో కేకలు వేయడంతో అడవి పందులు గ్రామంలోని ఇళ్లల్లోకి ప్రవేశించాయి. దీంతో గ్రామస్తులు తమ ఇళ్లకు తలుపులు బిడాయించుకున్నారు. అడవి పందులు ఇళ్ల తలుపులను తలలతో గుద్ది గ్రామంలో అటు ఇటు పరుగు తీశాయి. వీధుల్లో ఉన్న ద్విచక్ర వాహనాలను దొర్లించాయి. సుమారు గంటపాటు గ్రామంలో బీభత్సం సృష్టించాయి. ఆ తర్వాత సమీపంలోని అడవిలోకి పరుగులు తీయడంతో గ్రామస్తులు ఊపిరి తీసుకున్నారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా వారు విచ్చేసి అడవి పందులు గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.